మహబూబ్నగర్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నీటి వృథాకు చెక్ పెట్టేందుకు సర్కార్ పూనుకున్నది. వాగులపై చెక్డ్యాంలతో భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించారు. ఒక్క యూనిట్ కరెంట్ కూడా ఖర్చు కాకుండా, కాల్వలు తవ్వాల్సిన పని లేకుండా తక్కువ ఖర్చుతో 25 వేల ఎకరాల్లో రెండు పంటలకు నీరందుతున్నది. మండుటెండలోనూ వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. కాగా, మరికొన్ని మండలాల్లో ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించగా.. తొమ్మిది చోట్ల ఏర్పాటు చేసేందుకు రూ.77.69 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. వీటి పనులు పూర్తయితే 30 చెక్డ్యాంలతో దేవరకద్ర ఉమ్మడి జిల్లాలోనే రికార్డు నెలకొల్పనున్నది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషి ఫలించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వానలు సమృద్ధిగా కురిసినా.. వర్షపు నీరు వృథాగా వాగులు, వంకలు, నదుల గుండా వెళ్లి సముద్రాల పాలయ్యేది. చెంతనే వాగులున్నా.. వ్యవసాయానికి అక్కరకు రాని పరిస్థితి. చిన్న కాల్వలు, పెద్ద వాగులు పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. వాగు పరీవాహక ప్రాంతాల్లో వరద పారినా రైతులకు ఉపయోగపడేది కాదు. కొంతమంది రైతులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పైప్లైన్లు వేసుకుని పొలాలకు నీరు పారించుకునేవారు. అది కూడా ఒక్క తడికే సరిపోయేవి. వాగుల్లో భూగర్భ జలాలు పెంచుతామని అప్పటిప్రభుత్వాలు ఇసుక చాటున డైక్లు వేసి కోట్లాది రుపాయల అవినీతికి పాల్పడ్డాయి. ఇదంతా ఒకప్పుడు..
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ వాగులు, వంకలపై చెక్డ్యాం లు నిర్మించాలని తీసుకున్న నిర్ణయం సత్పలితాలనిస్తున్నది. సింగిల్ యూనిట్ విద్యుత్ ఖ ర్చు కాకుండా.. కాలువలు తవ్వాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో నిర్మించిన చెక్డ్యాంల వల్ల ఏకంగా 25వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతున్నది. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పా రుతున్న వాగులు, వంకలపై ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించి వేసవికాలంలో కూడా మత్తడి దూకుతున్నా యి. ఫలితంగా వాగు పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి పొలాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద వస్తున్న కాలువను మళ్లించి నీ టిని వదలడంతో వాగులు, చెరువులు కళకళలాడుతున్నాయి. గతేడాది కురిసిన వర్షాల వల్ల వరదలను ఒడిసి పట్టడంతో వానకాలం, యాసంగి లో పంటలకు పుష్కలంగా నీరందింది. దీంతో ఎన్నో చెరువులకు లింకులలు ఏర్పాటు చేశారు. తాజాగా మరికొన్ని మండలాల్లో 9 చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదించగా.. ఇటీవలే సీఎం కేసీఆర్ రూ.77.69కోట్లు మంజూరు చేశారు. దీంతో దేవరకద్ర నియోజకవర్గం చెక్డ్యాంలకు అడ్డాగా మారింది. 30 చెక్డ్యాంలతో ఉమ్మడిజిల్లా లో అత్యధిక చెక్డ్యాంలు కలిగిన నియోజకవర్గంగా రికార్డు సాధించింది.
రూ.77.69 కోట్లతో 9 చెక్డ్యాంలు
నియెజకవర్గంలోని పెద్దవాగుపై తొమ్మిది చోట్ల చెక్డ్యాంలు నిర్మించడానికి ప్రభుత్వం రూ.77.69కోట్లు విడుదల చేసింది. ఏప్రిల్ 17న నిధులు విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దవాగుపై పోతులమడుగు, రాచాలా, పాతమొల్గర, రావులపల్లిలో చెక్డ్యాంల నిర్మాణానికి రూ.21.39కోట్లు మంజూరు కాగా నెల్లికొండి, వడ్డేమాన్, తిర్మలాపూర్, గోప్లాపూర్ వద్ద చెక్డ్యాంల నిర్మాణానికి రూ.59.03కోట్లు విడుదల చేసింది. ఈ చెక్డ్యాంలన్నీ పెద్దవాగుపైనే నిర్మిస్తున్నారు. ఈ చెక్డ్యాంల నిర్మాణంతో సుమారు 6వేల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడాదిలో వచ్చే వరదను ఎక్కడికక్కడే కట్టడి చేసి లింక్ కెనాళ్ల ద్వారా సమీపంలోని చెరువుల్లోకి మళ్లించుకోవచ్చు. అదేవిధంగా పరివాహక ప్రాంతాల్లో రెండు పంటలకు నీళ్లు అందించడంతో భూగర్భజలాలు పెరిగి బోర్లు రీచార్జ్ అయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాకే ఆదర్శంగా..
దేవరకద్ర నియెజకవకర్గంలో నిర్మించిన చెక్డ్యాంలు ఉమ్మడి జిల్లాలకే ఆదర్శంగా మారాయి. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఇంజినీర్ కావడంతో చెక్డ్యాంలు నిర్మించాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నియోజకవర్గంలో పెద్దవాగుపై చెక్డ్యాంలు నిర్మించడం వల్ల కిలోమీటరు పొడవునా నీళ్లు నిలవడమే కాకుండా పరీవాహక ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించవచ్చు. దీంతో జడ్చర్ల, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి, మక్తల్, మహబూబ్నగర్, నారాయణపేట నియోజకవకర్గాల్లోనూ చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదించారు. దుందుభీ నదిపై చెక్డ్యాంలు నిర్మించడంతో ఈఏడాది జలకళ సంతరించుకున్నది.
కరివెనతో మరో కోనసీమ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలైలోగా రిజర్వాయర్లను నింపాలని సీఎం ఆదేశించడంతో అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అత్యధిక సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ కరివెనే కావడంతో ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ఇందులో నీళ్లు నిల్వ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మండుటెండలో సైతం కరివెనలో కేవలం వర్షపు నీరే రెండు టీఎంసీల వరకు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 19 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపితే దేవరకద్ర నియోజకవర్గానికి సాగునీటి ఢోకా ఉండకపోగా.. మరో కోనసీమగా మారుతుందని చెబుతున్నారు.
సీఎం మెచ్చిన ఎమ్మెల్యే..
మహబూబ్నగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ దేవరకద్ర నియెజకవర్గంలో నిర్మించిన చెక్డ్యాంలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే అంటే ఆల వెంకటేశ్వర్రెడ్డిలా ఉండాలని గుర్తు చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన చెక్డ్యాంలు కళకళలాడుతున్నాయని అభినందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగిందని సీఎం కితాబిచ్చారు.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
నియోజకవర్గంలో మరో తొమ్మిది చెక్డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. వీటికి రూ.77.69 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటికే 21 చెక్డ్యాంలు నిర్మించాం. దాదాపు 25వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఈ 9 చెక్డ్యాంల వల్ల మరో ఆరువేల ఆయకట్టుకు నీరందనున్నది. భూగర్భ జలాలు కూడా పెరిగాయి. మా నియెజకవకర్గంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేసిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర