వనపర్తి, మార్చి 9 : వనపర్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న వశ్యాతండా ప్రజలు ఒక్క రోడ్డు కోసం పాతికేండ్లుగా ఎదురుచూశారు. వశ్యతండా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కొంత భాగం. ఆ వార్డుకు 20 ఏండ్లు కౌన్సిలర్లుగా కాంగ్రెస్ పార్టీ చెందిన వారే ఉన్నారు. అదే తండాకు చెందిన వ్యక్తి కాంగ్రెస్ తరఫున 15 ఏండ్లు పరిపాలించారు. తండావాసి కౌన్సిలర్ అయితే గూడెంకు వెళ్లేందుకు ఒక్క సీసీ రోడ్డు అయినా మంజూరుకాదా.. అన్న నమ్మకంతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. అయినా వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ వచ్చారు. ఎలక్షన్ సమయంలో నాయకులు రావడం.. ఈసారి తప్పకుండా సీసీ రోడ్డు వేయిస్తాం.. మమ్మల్ని నమ్మండి అని చెప్పడం పరిపాటిగా మారింది.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. అస్సలు వశ్యాతండా ఒకటి ఉందన్న సంగతే మరిచారు. దీంతో విసుగుచెందిన తండావాసులు 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయకుండా భీష్మించుకు కూర్చున్నారు. ఓటు వేసేందుకు తండా ప్రజలు రాకపోవడంతో మధ్యాహ్నం తరువాత అధికారులు అధికారులు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. తమ తండాకు సీసీరోడ్డు వేయకపోతే ఓటేయమని ఖరాకండిగా తేల్చిచెప్పారు. ఓటు హక్కు వినియోగించుకుంటేనే మీ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు తండావాసులకు నచ్చజెప్పారు. దీనికి వారు ఒప్పుకొన్నారు. ఆ వెంటనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తండా నుంచి రెండోసారి మహిళకు కౌన్సిలర్ రిజర్వేషన్ వచ్చింది. 15 ఏండ్లు తండాను పరిపాలించిన మహిళ కాంగ్రెస్ నుంచి.., బీఆర్ఎస్ నుంచి మేఘావత్ శాంతి బరిలో నిలిచారు. ధ్రువపత్రాల పరిశీలనలో కౌన్సిలర్ అభ్యర్థి రిజెక్ట్ కాగా.. వనపర్తి మున్సిపాలిటీ ఏర్పడిన పాతికేండ్ల చరిత్రలో మొట్టమొదటి ఏకగ్రీవ కౌన్సిలర్గా మేఘావత్ శాంతి ఎన్నికయ్యారు. ఆమెకు చదువు రాదు.. ఎలా అభివృద్ధి చేస్తారంటూ కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేశారు. అయినా వెనుతిరగకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారు. మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కార మార్గాన్ని చూపించారు.
వార్డు పర్యటనతో సీసీ రోడ్డుకు పునాది..
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వశ్యతండాలో పలుమార్లు పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, అప్పటి కమిషనర్ మహేశ్వర్రెడ్డి వార్డు నిద్ర కూడా చేపట్టారు. వార్డు పర్యటనలో భాగంగా మంత్రి నిరంజన్రెడ్డి తండా మొత్తం తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. నీళ్ల ట్యాంక్ ఒక్కటే ఉన్నందున సరిపోవడంలేదని.., తాగునీటి బోరు వేయించాలని ప్రజలు కోరారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి తాగునీటి బోరు వేయించారు. అలాగే తమ తండాకు రోడ్డు, వీధిలైట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, పాతికేండ్లుగా కల సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నామని ప్రజలు వివరించారు. దీంతో చలించిన మంత్రి వశ్యతండాకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్నారు. గతేడాది మార్చి 8వ తేదీన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా వనపర్తికి వచ్చిన సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు ఇస్తానని ప్రకటించారు. ఆ వెంటనే నిధులను కూడా మంజూరు చేశారు. ఇందులో భాగంగా వశ్యతండాకు రూ.84లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అప్పాయిపల్లి ప్రధాన రహదారి నుంచి వశ్యతండాకు దాదాపు 650 మీటర్ల మేర సీసీ రోడ్డుతోపాటు ఇరువైపులా విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు దశాబ్దాల కలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డికి తండావాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం..
రోడ్డు ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉం టుంది. లేకుంటే అన్నీ ఇబ్బందులే. జిల్లా కేం ద్రంతోపాటు గ్రామాలు, తండాల్లో ఎక్కడికక్కడ బీటీ, సీసీ రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. ప్రజలకు సౌకర్యాల కల్పనే ప్రభు త్వ లక్ష్యం. గతంలో ఉన్న నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి ఓ ట్లు దండుకున్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం ఇచ్చిన, ఇవ్వని హామీలను కూడా నె రవేరుస్తున్నది. వశ్యాతండాకు రోడ్డు వేస్తుం టే.. స్థానికుల కండ్ల వెంట వచ్చిన ఆనందభాష్పాలు చూస్తే కడుపు నిండుతుంది. – సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
మంత్రి చొరవతోనే సీసీ రోడ్డు..
మా తండాకు రావాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. ఈ విషయాన్ని మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఇందుకు ఆయన వెంటనే స్పందించి ప్రత్యేక చొరవతో దాదా పు 650 మీటర్ల మేర అప్పాయిపల్లి రహదారి నుంచి వశ్యతండా వరకు సీసీ రోడ్డు వేయిస్తున్నారు. అంతేకాకుండా దారివెంట వీధి లైట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. చాలా ఆనందంగా ఉన్నది. పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
– మేఘావత్ శాంతి, ఐదో వార్డు కౌన్సిలర్, వనపర్తి
కల సాకారమవుతున్నది..
నా చిన్నప్పటి నుంచి తండాకు ఆనుకొని ఉన్న ప్లాట్లనుంచే వెళ్తున్నాం. రోడ్డు మార్గం లే దన్న విషయాన్ని తండా పర్యటనకు వచ్చిన మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. అ లాగే తాగునీటి సమస్య కూడా ఉందని, సమస్యను పరిష్కరించాలని విన్నవించాం. వెంట నే తాగునీటి బోరు వేయించారు. తండాకు సీసీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నా యి. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డికి తండావాసుల తరఫున ప్ర త్యేక ధన్యవాదాలు. – రమేశ్నాయక్, వశ్యతండా