మహబూబ్నగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు సిగలోకి మరో మణిహారం వచ్చి చేరింది. ఇప్పటికే బైపాస్ ఉండగా. రెండో బైపాస్ రానున్నది. భూత్పూరు-చించోలి హైవే-167 ఎన్లో భాగంగా నిర్మిస్తున్నారు. పాలకొండ సమీపంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి పీయూ, చిన్నదర్పల్లి మీదుగా కోస్గి-మహబూబ్ నగర్ రోడ్డుకు అనుసంధానం చేస్తారు. ఇక జాతీయ రహదారి పనులు మొదటి ప్యాకేజీలో భూత్పూరు టు దుద్యాల వరకు 60 కి.మీ. దూరాన్ని
రూ.703 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో రోడ్డుకు రూ.330 ఖర్చు చేస్తుండగా.. భూ పరిహారం కింద రూ.373 కోట్లు కేటాయించారు.అలాగే రెండో దఫాలో 44 కి.మీ. దూరాన్ని కొనసాగించనున్నారు. పాత, కొత్త బైపాస్లు కలిసే చోట పెద్ద జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు.పనులు పూర్తయితే బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలం, తాండూరుకు వెళ్లే మార్గం సుగమం కానున్నది.
దినదినాభివృద్ధి చెందుతున్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి మరో బైపాస్ రాబోతున్నది. మహబూబ్నగర్-చించోలి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చిన్నదర్పల్లి వద్ద కలుపుతూ జిల్లా కేంద్రం శివారులో కొత్త బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఎస్వీస్ వద్ద నుంచి పాలకొండ వరకు బైపాస్ ఉన్నది. ఈ రోడ్డుకు కలుపుతూ కొత్త బైపాస్కు రూపకల్పన చేశారు. సమీకృత కలెక్టరేట్ సమీపంలోని నెక్సా షోరూం పక్క నుంచి క్రిస్టియన్పల్లి డబుల్ బెడ్రూం వెనకాల నుంచి పీయూ-ధర్మాపూర్ రహదారి మీదుగా చిన్నదర్పల్లి వద్ద కోస్గి-తాండూరు రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ రహదారి మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లాల్సిన భారీ వాహనాలకు సౌలభ్యంగా మారనున్నది. మరోవైపు రాయిచూర్ నుంచి హైదరాబాద్.., ఇటు తాండురు నుంచి వెళ్లే వాహనాలకు ఈ బైపాస్ ఉపయోగపడనున్నది. మహబూబ్నగర్ పట్టణంలోకి రావాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలో ఇటు నుంచి జడ్చర్ల-రాయిచూర్ 167 జాతీయ రహదారికి, అటు హైదరాబాద్-బెంగళూరు 44వ జాతీయ రహదారికి లింక్గా మారనున్నది.
పీయూ సమీపంలో ఉన్న రైల్వేలైన్పై కొత్త ఆర్వోబీని ఏర్పాటు చేస్తూ భూత్పూర్ నుంచి పీయూ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మించనున్నారు. చిన్నదర్పల్లి నుంచి కోస్గి సమీపంలోని దుద్యాల వరకు మూడులేన్ల రహదారి నిర్మాణం జరుగుతున్నది. మహబూబ్నగర్-చించోలి రహదారి మొత్తం 104 కిలోమీటర్లు కాగా, రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేశారు. మొదటి ప్యాకేజీలో భూత్పూర్ నుంచి దుద్యాల వరకు 60 కిలోమీటర్ల మేర రూ.703 కోట్లు ఖర్చు చేయనున్నారు. కేవలం రహదారికి రూ.330 వెచ్చించగా.. ఇండ్లు, భూములు కోల్పోతున్న వారికి పరిహారం కింద రూ.373 కోట్లు కేటాయించారు. సమీకృత కలెక్టరేట్ సమీపంలో ఇప్పుడున్న బైపాస్ను కలుపుతూ పెద్ద జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త బైపాస్ నిర్మాణం, భూత్పూర్-కోస్గి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇటీవలే ప్రారంభించారు. ప్యాకేజీ దక్కించుకున్న సంస్థ గండీడ్ నుంచి కోస్గి వరకు పనులు చేపట్టింది. రహదారిని వెడల్పు చేస్తున్నారు. ఇక భూత్పూర్ నుంచి బైపాస్ మీదుగా చిన్నదర్పల్లి వరకు చేపట్టిన పనులను మే నెల చివరలో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. బైపాస్ను కొత్త జాతీయ రహదారికి అనుసంధానిస్తుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఎకరా రూ.30 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.కోటి పలుకుతున్నది.
మారనున్న హన్వాడ రూపురేఖలు..
మహబూబ్నగర్కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్వాడ మండలాన్ని తెలంగాణ రాకముందు చిన్న చూపు చూసేవాళ్లు. దీంతో చాలా మంది అక్కడ ఉండలేక మహబూబ్నగర్లో ఇండ్లు అద్దెకు తీసుకునేవారు. స్వరాష్ట్రంలో ఈ మండలం రూపురేఖలు మారిపోయాయి. చించోలి జాతీయ రహదారి వస్తుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 250 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానున్నది. మోడల్ రైతుబజార్ నిర్మించారు. మండల కేంద్రం సమీపంలోని చెరువును మినీ ట్యాంకుబండ్గా మార్చడం, మిషన్ కాకతీయ కింద పూడికతీత పనులు జరగడంతో ఎండాకాలంలో కూడా జలసిరులు కురిపిస్తున్నది. కోస్గి, కొడంగల్, తాండూరు పట్టణాల మీదుగా నూతన జాతీయ రహదారిని అనుసంధానిస్తుండడంతో భవిష్యత్లో పట్టణాభివృద్ధి వేగంగా సాధ్యంకానున్నది.
టెండర్ దక్కించుకున్న సంస్థ జాతీయ రహదారి నిర్మాణ పనులు చకచకా చేపడుతున్నది. గండీడ్ మండలం నుంచి దుద్యాల వరకు రహదారిని ఇరువైపులా విస్తరిస్తున్నారు. అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తూ రహదారి పక్కన చదును చేస్తున్నారు. రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. భూత్పూర్ నుంచి పీయూ వరకు నాలుగులేన్ల రహదారి, పీయూ సమీపంలోని రైల్వేలైన్ వద్ద ఆర్వోబీతోపాటు చిన్నచిన్న వంతెనలు నిర్మిస్తున్నామని జాతీయ రహదారుల సంస్థ డిప్యూటీ ఈఈ రమేశ్బాబు తెలిపారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి పనుల వర్క్ డిజైన్ ఫైనల్లో ఉందని, మే చివరి వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ జాతీయ రహదారి మహబూబ్నగర్, దేవరకద్ర, పరిగి, కొడంగల్ నియోజకవకర్గాల మీదుగా వెళ్తుందన్నారు.
రూ.703 కోట్లతో ‘167-ఎన్’
మహబూబ్నగర్- చించోలి జాతీయ రహదారి పనులు శరవేగంగా సాగుతున్నాయి. కోస్గి మీదుగా చించోలి వరకు 167-ఎన్ జాతీయ రహదారిగా గుర్తించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణను కలిపే రహదారిని నేషనల్హైవేగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఢిల్లీ వెళ్లి సంబంధింత మంత్రులను కలిశారు. రహదారి నిర్మాణమైతే వెనుకబడిన హన్వాడ, కోస్గి వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించడంతో జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆర్అండ్బీ శాఖ జాతీయ రహదారుల సంస్థకు అప్పగించగా.. పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇటీవల ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం.. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి(ఎన్హెచ్-44)కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ కోదాడ నుంచి రాయిచూర్ వరకు ఉన్న ఎన్హెచ్-167 మహబూబ్నగర్ మీదుగా వెళ్తున్నది. కొత్తగా చేపట్టే మహబూబ్నగర్-చించోలి రహదారిని.. ఎన్హెచ్-44కు అనుసంధానిస్తున్నారు. ప్రస్తుతం తాండూరు వైపు నుంచే వచ్చే వాహనాలు పట్టణంలోకి వచ్చి ట్రాఫిక్జామ్కు కారణమవుతున్నాయి. రాత్రి వరకు నిలిచి మహబూబ్నగర్ దాటాల్సి ఉన్నది. దీంతో సమయం వృథా అవుతున్నది. ఈ క్రమంలో బైపాస్ పనులు పూర్తయితే మహబూబ్నగర్లో ట్రాఫిక్ సమస్య దాదాపుగా తీరనున్నది.