నారాయణపేట టౌన్, జనవరి 4: మహిళలు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని జెడ్పీ చైర్పర్సన్ వనజగౌడ్ అన్నారు. పట్టణంలోని ఘన్శ్యాం సరోడే గృహంలో నాబార్డ్ సహకారంతో కలంకారి చేతి చిత్రలేఖనంపై మంగళవారం నైపుణ్య శిక్షణా తరగతులను కలెక్టర్ హరిచందనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు చిత్రలేఖనం నేర్చుకొని ఉపాధి పొందాలన్నారు. ఘన్శ్యాం సరోడే ఆధ్వర్యంలో ఇద్దరు శిక్షకులను నియమించి 40 రోజులపాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఆధునిక ఒరవడి వల్ల ఎంతో పేరుగాంచిన కలంకారి పెయింటింగ్ అంతరించిపోతున్నదన్నారు. రానున్న రోజుల్లో ఎంబ్రాయిడరీ తదితర రంగాల్లో సైతం శిక్షణా తరగతులు నిర్వహించి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, ఎమ్మెల్యే సతీమణి స్వాతిరెడ్డి, డీఆర్డీవో గోపాల్నాయక్, నాబార్డ్ డీడీఎం నాగార్జున, ఆత్మారాం ఎడ్కే, మహిళలు పాల్గొన్నారు.
వ్యవసాయానికి రూ.2,184.35 కోట్లు
2022-23 సంవత్సరానికి గానూ జిల్లాలో వ్యవసాయ రంగానికి రూ.2,184.35 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.119.41కోట్లు, విద్యా రుణాలకు రూ.4.76కోట్లు, గృహనిర్మాణాలకు రూ.9.52కోట్లు, ఇతర సామాజిక మౌలిక రంగాలకు రూ.16.58కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అధికారి నాగార్జున, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.