నవాబ్పేట, జనవరి 24 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చెన్నవీరయ్య కోరారు. మండలంలోని కొల్లూరు గ్రామంలో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన జట్లకు చెన్నవీరయ్య బహుమతులు అందజేసి మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహించే ఇలాంటి టోర్నీలతో మెరికల్లాంటి క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. వాలీబాల్ క్రీడాకారులకు ఉమ్మడి జిల్లాలో తమ అసోసియేషన్ నుంచి సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. వేసవి కాలంలో వాలీబాల్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు బ్లూమూన్స్ హోటల్ నవాబ్పేట, చిన్నరేవల్లి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో బ్లూమూన్స్ నవాబ్పేట జట్టు విజేతగా నిలిచింది. బ్లూమూన్ నవాబ్పేట జట్టుకు రూ. 25వేల నగదు, ట్రోఫీ, రన్నర్ జట్టు చిన్నరేవల్లికి రూ,12,500 నగదు, ట్రోఫీ, తృతీయ బహుమతి పొందిన కొందుర్గు జట్టుకు రూ. 6వేల నగ దు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్యారఘు, ఎంపీటీసీ తుల్సీరామ్నాయక్, నాయకులు చందర్నాయక్, బాల్రెడ్డి, రఘు, రాజు, ఖాజా, రత్నబాబునాయక్, వెంకట్రావునాయక్, కృష్ణగౌడ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో స్నేహభావం
క్రీడల ద్వారా ఆరోగ్యం, మానసికోల్లాసంతోపాటు స్నేహభావం పెంపొందుతుందని కౌకుంట్ల సర్పంచ్ స్వప్నాకిషన్రావు, ప్రముఖ సామాజికవేత్త రాయల్టౌన్షిప్ యజమాని షేక్ అబ్దుల్ జహంగీర్ అన్నారు. మండలంలోని కౌకుంట్ల గ్రామంలో చెగువేరా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడిజిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 42 జట్లు పాల్గొనగా పడకల్కు చెందిన జట్టు విజేతగా నిలిచింది. కేశంపేటకు చెందిన జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. విజేత జట్టుకు రాయల్టౌన్షిప్ యజమాని జహంగీర్పాషా రూ.30 వేల నగదు బహుమతి, కేశంపేట జట్టుకు సర్పంచ్ స్వప్నాకిషన్రావు రూ.20 వేల నగదు అందజేశారు, అలాగే తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు తుమ్మల శేఖర్రెడ్డి షీల్డ్ అందజేశారు. కార్యక్రమంలో మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కిష న్న, నిర్వాహక కమిటీ సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.