నారాయణపేట టౌన్, జనవరి 10 : చూపులేని ఎందరో దివ్యాంగుల జీవితాల్లో అక్షర జ్యోతి వెలిగించిన మహావ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని కలెక్టర్ హరిచందన అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చూపులేని దివ్యాంగుల కోసం లూయిస్ బ్రెయిలీ లిపిని కనిపెట్టి కళ్లులేని దివ్యాంగులు చదువుకునేలా చేశారన్నారు. బ్రెయిలీ లిపితో చదువుకొని ఎంతో మంది ఉన్నత పదవులు పొందారన్నారు. జిల్లాలో పేద దివ్యాంగులు చదువుకునేందుకు పాఠశాలలు ఉన్నాయని, చూపు లేదని ఏ ఒక్క దివ్యాంగుడు విద్యకు దూరం కావొద్దని ఆమె చెప్పారు. బ్రెయిలీ విద్య అభ్యసించాల్సిన దివ్యాంగుల తల్లిదండ్రులు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలని కోరారు. దివ్యాంగుల కోసం ట్రాన్స్లేటర్ యంత్రాన్ని తెప్పించి అందుబాటులో ఉంచాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీసీపీవో కుసుమలత, సీడీపీవోలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
సమిష్టిగా కృషి చేయాలి
జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలను రూపుమాపాలంటే సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ 8వ విడుత నిర్వహణ కోసం లైన్ డిపార్మెంట్ అధికారులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బడిఈడు పిల్లలను ఇటుక బట్టీలు, పరిశ్రమలు, హోటళ్లల్లో పనిలో పెట్టుకున్నా, బలవంతంగా యాచక వృత్తిలోకి పంపించినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలతో సమన్వయం చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని లైన్ డిపార్మెంట్ అధికారులను ఆదేశించారు. పిల్లలను బానిసగా పెట్టుకుంటే అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సహాయ సహకారాలు అందిస్తాం
అదనపు ఎస్పీ భరత్ మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థను, బాల్య వివాహాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కళాబృందం సభ్యుల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం వాల్పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, డీసీపీవో కుసుమలత, లేబర్ ఆఫీసర్ రాజ్కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించాలి
జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి రెండు నెలల్లో వారిని ఆరోగ్యకరమైన స్థితికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సీడీపీవోలు, సూపర్వైజర్లతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సెప్టెంబర్, నవంబర్ నెలల్లో చిన్నారుల రిపోర్టుల్లో పెద్దగా తేడా లేదని, చాలా మంది పిల్లలు ఎత్తుకు తగిన బరువు లేరన్నారు. సీడీపీవోల పర్యవేక్షణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, సూపర్వైజర్లు ప్రతిరోజూ ఏ సెంటర్కు వెళ్తున్నారో మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో సీడీపీవోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.