కొత్తకోట : హైదరాబాద్లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త కోటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. కొత్తకోట పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెరకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి (55) అలియాస్ గొల్లబాబు దుర్మరణం చెందారు. గురువారం హైదరాబాద్ లో ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్ సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
చంద్రశేఖర్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ప్రమాణాస్వీకారం చేశారు. గొల్లబాబు మరణంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి(గొల్లబాబు) మృతికి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.