నాగర్కర్నూల్ జిల్లాలోని కందనూలులో సామూహిక వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కందనూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి చేతులమీదుగా ఈ వివాహ వేడుకలు జరుగగా.. జెడ్పీ హై స్కూల్ మైదానంలో సినిమా సెట్టింగ్ తలపించేలా భారీగా వేసిన మండపాల్లో 220 జంటలు ఒక్కటయ్యాయి. ఈ వివాహాలకు మర్రి జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి జమున రాణి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి.. పెళ్లి చేసుకున్న జంటలకు పట్టువస్ర్తాలు, బంగారు తాళి, మెట్టెలు అందించారు.
ఈ వేడుకలకు ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. కాగా.. పెళ్లిళ్లను చూసేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. పెళ్ళి అనంతరం వివాహ జంటలకు బీరువా, మంచం, ఇతర వంట సామాగ్రి అందజేసి.. భారీ ఊరేగింపు మధ్య స్వగ్రామాలకు పంపించారు. ఇప్పటికే నాలుగు విడతల్లో ఈ సామూహిక పెళ్లిళ్లు జరుగగా ఐదోసారీ మరింత అట్టహాసంగా జరగడం విశేషం.
ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ శాంతికుమారి, కలెక్టర్ ఉదయ్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, ట్రస్ట్ డైరెక్టర్లు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.