నాగర్కర్నూల్, డిసెంబర్ 27 : నాగర్కర్నూల్ జిల్లాలో రైతులు యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసేలా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ప్రోత్సహించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, హార్టికల్చర్, భూగర్భజల, ప్రణాళిక శాఖల అధికారులతో వానకాలం సాగు విస్తీర్ణం, సాగు ధృవీకరణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెసర, మినుములు, నువ్వులు, మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకునేలా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రైతులకు ఆయా పంటల సాగు విషయంలో సందేమాలు ఉంటే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఆరుతడి పంటల వైపునకు రైతులు దృష్టి మరల్చేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఈ వానకాలం పంటల విస్తీర్ణం నిర్ధారణపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం వానకాలం సాగు విస్తీర్ణం నిర్ధారణ ప్రకారం 1,23,071 ఎకరాల్లో వరి పంట సాగు చేయడం జరిగిందని, 3,30,596 ఎకరాల్లో పత్తి పంట, 30,989 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,38,483 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయడం జరిగిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ముఖ్య ప్రణాళికా అధికారి భూపాల్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్రావు, భూగర్భ జలశాఖాధికారి రమాదేవి, ఇరిగేషన్ అధికారి, మత్స్యశాఖాధికారి లక్ష్మప్ప తదితరులు పాల్గొన్నారు.