‘పది’ ఫలితాల్లో ప్రభుత్వ బడులు మెరిశాయి. ఉత్తీర్ణతలో ప్రైవేటుకు దీటుగా సర్కార్ విద్యార్థులు సత్తా చాటారు. అలాగే గురుకుల విద్యార్థులు సైతం మంచి గ్రేడింగ్ సాధించారు. ఉమ్మడి జిల్లాలో నాగర్కర్నూల్ జిల్లా టాప్ లేపగా.. రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలు 25, 27, 31, 32 స్థానాలను దక్కించుకున్నాయి. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. కొన్ని పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించి శభాష్ అనిపించుకున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఫలితాలు పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు. సర్కార్ బడులు, గురుకులాల ఫలితాల చూసి కలెక్టర్లు అభినందించారు.
Government schools | మహబూబ్నగర్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా టాప్లో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో ఉండగా.. ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో 10,545 మంది పరీక్షలు రాయగా.. 9,582 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 90.87గా ఉన్నది. వనపర్తి రాష్ట్ర స్థాయిలో 81.93 శాతం ఉత్తీర్ణతతో 25వ స్థానంలో.. జోగుళాంబ గద్వాల 80.70 శాతంతో 27వ స్థానంలో నిలిచాయి. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో ఆశించినంతగా ఫలితాలు రాకపోవడంతో చివరి రెండు, మూడు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. గతేడాదికంటే ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గింది. బదిలీలు, ఇతరత్రా కారణాల వల్ల విద్యార్థులపై శ్రద్ధ కనపర్చలేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. అన్ని జిల్లాల్లో గురుకుల పాఠశాల విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఆశించినంత ఫలితాలు సాధించలేకపోయామని యాజమాన్యం అంటున్నది. ఉమ్మడి జిల్లాలో రానురానూ ఉత్తీర్ణత శాతం తగ్గుతున్నది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఫలితాలు నిరాశకు గురిచేశాయి. మహబూబ్నగర్ జిల్లా 32, నారాయణపేట 31 స్థానంలో నిలిచాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆయా జిల్లాల్లో ఉత్తీర్ణతా శాతం పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తీర్ణత శాతం బాగా పెరిగిందని విద్యాశాఖాధికారులు అంటున్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఫలితాలు పెరిగాయని చెప్పొచ్చు. ఉత్తీర్ణతా శాతం పెరగడంతో కలెక్టర్లు అభినందిస్తున్నారు.