భూత్పూర్, ఫిబ్రవరి 8 : భూత్పూర్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మునిరంగస్వామి మహిమాన్వితుడిగా విరాజిల్లుతున్నాడు. మునిరంగస్వామి మహావిష్ణువుకు ప్రతిరూపమని, పేదల ఉద్ధరణకు జన్మించాడని భక్తుల విశ్వాసం. మునిరంగస్వామి గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్లో జన్మించినట్లు కథలు, పాటల రూపకంగా తెలుస్తున్నది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. మునిరంగస్వామిని చింతలు తొలగించే చింతల మునిరంగడని కూడా పిలుస్తారు. అంటరానితనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో మహావిష్ణువు ప్రదర్శించిన లీల అని కొందరు భావిస్తున్నారు. కాగా, భూత్పూర్లో నిర్మించిన ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది.
ఆరేండ్ల కిందట ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ శోభారత్నం ఆలయం ఎదుట గణపతి విగ్రహం, ధ్వజస్తంభం, వేణుగోపాలస్వామి, నవగ్రహాలను ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ ప్రాంగణంలో రూ.34 లక్షలతో కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. కాగా, మునిరంగస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ తేదీన స్వామివారి ఊరేగింపు, 11న రాత్రి 10 గంటలకు స్వామివారి రథోత్సవం, 12న సాయంత్రం 5 గంటలకు శకటోత్సవం, 13న పుట్టసేవ, 14న స్వామివారి ఉత్సవాలు, 15న కల్యాణోత్సవం, 16న స్వామివారి పల్లకీసేవ, 17న అవభృతాభిషేకం, ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్ నాగమ్మ తెలిపారు. జాతరకు మండల ప్రజలే కాకుండా, హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.