నాగర్కర్నూల్, ఫిబ్రవరి 28 : నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కుమ్మెర ఘటనలో బాధితుల పక్షమా..? లేక నిందితుల పక్షమా..? అన్నది తేల్చాలని బాధితుల న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్ పట్టణంలోని బాబు జగ్జీవన్రామ్ భవన్లో ఐకాస కన్వీనర్ బోనాసి రాంచందర్, కోకన్వీనర్లు పర్వతాలు, కోళ్ల శివ, శ్రీను, ఎదిరేపల్లి కాశన్న, శివశంకర్యాదవ్, అంతటి కాశన్న, నిజామ్, రామయ్య, మధు, నవీన్, అశోక్, కళ్యాణ్, పుధ్వీరాజ్, వెంకటయ్య, రామకృష్ణ, తారాసింగ్ తదితరులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం కుమ్మెర గ్రామ పర్యటన నిజాలను సమాధి చేసేలా ఉందని విమర్శించారు. తక్షణమే కుమ్మెర గ్రామ సమస్యలపై సీఎం, హోంమంత్రి రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని బాధితులకు బాసటగా నిలిచి, నిందితులను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటి మొదటగా బాధితులను కలవాలని, ఆతర్వాత ఘటన స్థలాన్ని, ఆ తదుపరి సంబంధిత అధికారులను, చివరగా మళ్లీ బాధితులను కలవాల్సి ఉండగా, గ్రామంలో మీటింగ్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ సభ్యులు కుమ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటి ఎదుట మీటింగ్ నిర్వహించి బాధితులకు ఏం సందేశం ఇస్తుందని విమర్శించారు. రిజర్వేషన్ స్థానాల్లో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు దళిత బహుజనులకు అండగా ఉంటారని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కలలు కంటే, దానికి విరుద్ధంగా రాష్ట్రంలోని దళిత, బహుజన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయమని అడుగుతుంటే, బాధితురాలి వ్యక్తిత్వం గురించి మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. బాధితురాలు ఒకవేళ పిచ్చకుంట్ల కులానికే చెందినదే అనుకుంటే దాడి చేయవచ్చా అని ప్రశ్నించారు. బాధితురాలికి ఎన్ని పెండ్లిళ్లు అయ్యాయి, ఎంత మంది పిల్లలు ఉన్నారు అనేది నిందితుల అరెస్టు విషయాన్ని పక్కదారి పట్టించడానికేనని ఆరోపించారు. బాధితురాలికి ఎన్ని పెండ్లిళ్లు అయినా, ఎంత మంది పిల్లలు ఉన్నా, ఏకులమైనా గుడిలో గొడవ జరిగింది వాస్తవమని, మహిళలను కించపరిచింది వాస్తవమని, ఆ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లను ఎప్పుడు అరెస్టు చేస్తారని నిలదీశారు.
ఎక్కడో ఉన్న సంగాయిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ని పిలిచి కుమ్మెర గ్రామంలో నిర్వహించిన మీటింగ్లో మాట్లాడించారని, ఇంత శ్రద్ధ నిందితుల అరెస్టుపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. నిన్నటి కుమ్మెర మీటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీయే పూర్తిగా నిందితులకు మద్దతు పలుకుతున్నట్లు అనిపించిందని ఆరోపించారు. కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ పార్టీ తన మొండి వైఖరి విడనాడి, నిందితుల అరెస్టుకు పూర్తిగా పోలీస్ అధికారులకు స్వేచ్ఛనిచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. లేకపోతే నాగర్కర్నూల్ కేంద్రంగా బాధితులకు న్యాయంకోసం రిలే దీక్షలు, శాంతిర్యాలీ, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి, చివరగా న్యాయంకోసం బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సంఘాల పోరాటంలో మాజీ ఎమ్మెల్యే పాత్ర లేదని, అనవసరంగా సమస్యను పక్కదారి పట్టించి బాధితులకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ ఐకాస తరఫున పోరాటాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు భాస్కర్, రాంచందర్ పాల్గొన్నారు.