కలెక్టర్ ఎస్.వెంకట్రావు
మహబూబ్నగర్, ఏప్రిల్ 11 : దళితబంధు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.17కోట్ల 50లక్షలను జమ చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీనాటికి అధిక మొత్తంలో యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో లబ్ధిదారులను కలిసి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయా లేదా అనే విషయాలను తెలుసుకోవాలని సూచించారు. వాహనాలు, జనరల్ స్టోర్, సెంట్రింగ్ వంటి యూనిట్లను 14న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దళితబంధుకు సంబంధించి ఎలాంటి తప్పులు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే కలెక్టరేట్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. అలాగే విద్యుత్ బిల్లులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. ఈ-ఆఫీస్లోనే కార్యకలాపాలు కొనసాగించాలని తెలిపారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ వయోవృద్ధుల చట్టాలపై రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్యగౌడ్, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఎంహెచ్వో కృష్ణ, నరేందర్, ఆర్డీవో పద్మశ్రీ, డీడబ్ల్యూవో జరినాబేగం పాల్గొన్నారు.