వెల్దండ, ఆగస్టు 13 : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు వరప్రదాయిని అని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్ఎల్ఐ పనులు ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు కేసులతో అడ్డంకులు సృష్టించినా న్యాయమే గెలిచిందన్నారు. పీఆర్ఎల్ఐతో ఉమ్మడి జిల్లాల్లో ప్రతి ఎకరాకూ సాగునీరు అందనుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్వైపే ఉంటారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఎన్ని చేసినా కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. అంతకుముందు శంకర్కొండతండాలో సీసీరోడ్డు పనులను ఎమ్మెల్సీ ప్రారంభించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, నాయకులు జంగయ్యయాదవ్, ఆనంద్కుమార్, రాజశేఖర్, సర్పంచులు రాంచంద్రారెడ్డి, బీరయ్య ఉన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతి లభించడానికి కృషి చేసిన ప్రభుత్వానికి ఇదొక గొప్ప విజయం. రెండో దశలో కాల్వల పనులు పూర్తి చేసుకుంటే ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాలకు కృష్ణా జలాలు పారించవచ్చు. ఇది రైతాంగానికి గొప్ప వరంమని చెప్పవచ్చు. ముఖ్యంగా సాగునీటి వసతి లేని మెట్ట ప్రాంతమైన నారాయణపేట జిల్లాలో పంటలు పుష్కలంగా పండించుకోవచ్చు.
– ఎస్.ప్రతాప్, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్, టీఎస్ఐడీసీ