బిజినేపల్లి, జూలై 7 : ఆరునూరైనా మార్కండేయ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని శాయిన్పల్లి వద్ద చేపడుతున్న రిజర్వాయర్ పనులను కుర్చీ వేసుకొని మరీ కూర్చొని ఎమ్మెల్యే మర్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఎల్ఐ కాల్వపై భాగంలో ఉన్న గ్రామాలకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ను ఒప్పించి సుమారు రూ.77కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామన్నారు. రిజర్వాయర్ పూర్తయితే మమ్మాయిపల్లి, శాయిన్పల్లి, పోలేపల్లి, లట్టుపల్లి, గంగారం గ్రామాలతోపాటు 17గిరిజన తండాల రైతుల పొలాలకు సాగునీరు అందుతున్నదన్నారు.
సాగునీటితో సుమారు 7,200 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. మండలంలోని శాయిన్పల్లి గ్రామ సమీపంలోని కేఎల్ఐ ద్వారా మార్కండేయ రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోయనున్నట్లు వెల్లడించారు. 40మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ను అర టీఎంసీ సామర్థ్యంతో గంగారం గ్రామ సమీపంలో నిర్మాణం చేపడుతున్నామని, పనులు త్వరలోనే పూర్తి చేసి రైతుల పంట పొలాలను కృష్ణమ్మ నీటితో తడుపుతామన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.