అమ్రాబాద్, నవంబర్ 28 : అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. సోమవారం మండలంలోని ప్రశాంత్నగర్ కాలనీలో ఎస్సీ కార్పొరేషన్, గ్రామస్తులు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక అ భివృద్ధి సమావేశానికి విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వంద శాతం ఎస్సీలు ఉన్న ప్రశాంత్నగర్ కాలనీని అభివృద్ధి చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి రైతుకూ ఉచితంగా బోర్లు వేయించడంతోపాటు పనిముట్లు ఇస్తుందన్నారు. తన నిధుల నుంచి రూ.30లక్షలను మహిళా భవనం, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 20 మంది నాయకులు విప్ గువ్వల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, స్వామి, ఎంపీడీవో రామ్మోహన్, డీఎల్పీవో వెంకటయ్య, సర్పంచ్ శ్రీరాంనాయక్, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, నాయకులు చెన్నకేశవులు, కృష్ణ, రాంచంద్రయ్య, పాషా, నిరంజన్ పాల్గొన్నారు.