జడ్చర్ల, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో వారి జీవితాల్లో వెలుగులు సంతరించుకుంటున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల క్యాంప్ కార్యాలయంలో దళితబంధు యూనిట్ల కింద లబ్ధిపొందిన ఉదండాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురికి కార్లు, వల్లూరుకు చెందిన ముగ్గురికి జేసీబీలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితబంధు లబ్ధిదారులకు వరంలాంటిదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, దీంతో వారు అభివృద్ధిలో వెనుకబడిపోయారని చెప్పారు. అలాంటి వారిని వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణలో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
దళితబంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే జడ్చర్లలోని ఆగ్రోస్ కేంద్రంలో జీలుగ విత్తనాల పంపిణీని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.