మూసాపేట, నవంబర్ 11 : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆలోచన ఆ గ్రామ అభివృద్ధికి ఊతమిచ్చింది. వాగుపై నిర్మించిన చెక్ డ్యాంతోపాటు నిల్వ ఉండే నీటికి వాగు కాల్వ వద్ద ఒక చిన్న తూం ఏర్పాటు చేయడంతో గ్రామం పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అధికం. సారవంతమైన భూములు ఉన్నా సాగునీరు లేక మురికి తుమ్మచెట్లు మొలిచి పడావుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మూసాపేట మండలంలోని పెద్దవాగులో వదిలారు. దీంతో వాగు పరివాహక భూములు మాత్రం బోరుబావుల నుంచి పంటలు సాగుచేసుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి వీలైనంత మేరకు ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలనే సంకల్పంతో మరో అడుగు ముందుకేసి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లారు. దేవరకద్ర నియోజకవర్గంలో వాగులు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై చెక్డ్యాంలు నిర్మిస్తే రైతులకు మేలు చేకూరుతుందని చెప్పడంతో సీఎం సానుకూలంగా స్పందించి ఇప్పటి వరకు మొత్తం 30 చెక్డ్యాంలు మంజూరు చేశారు. అందులో ఇప్పటికే 21 చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి.
అందులో ఒకటి సంకలమద్ది గ్రామ శివారులో కొమిరెడ్డిపల్లి వాగు కాల్వకు దిగువ భాగంలో చెక్డ్యాం నిర్మించారు. చెక్డ్యాం శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దృష్టికి వాగు కాల్వను చూయించి ఈ కాల్వ ద్వారా సాగునీరు వస్తే చెరువులు నిండి పంటలు పుష్కలంగా పండుతాయని రైతులు చెప్పారు. అందుకు ఎమ్మెల్యే ఆల సొంత ఖర్చుతో కాల్వ పూడిక తీయించారు. కానీ వరద ఎక్కువగా వస్తే కాల్వపై నుంచి వరద నీరు వెళ్లి పంటలు పాడవుతున్నాయని కొంత మంది రైతులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా కాల్వ ద్వారా సాగునీరు వస్తే కేవలం కొమిరెడ్డిపల్లి గ్రామమే కాకుండా అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామం మీదుగా రాచాల వరకు ఉన్న చెరువులకు నీరు వచ్చి చేరుతుందని అడ్డాకుల ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి ఆయా గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఆయన చెక్డ్యాం వద్ద కాల్వను సందర్శించారు. చెక్డ్యాంపై కాల్వ ఉన్నందున ఎక్కువ వరద వచ్చి రైతులు ఇబ్బందులు పడకూడదని ఆలోచించి అధికారులకు కాల్వకు తూం ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.
వెంటనే చెక్డ్యాం భాగంలో తూం ఏర్పాటు చేయించారు. తూం ద్వారా నేటికి వాగు కాల్వ ద్వారా వరద నీరు కొమిరెడ్డిపల్లి చెరువులకు వరద వచ్చి చేరుతున్నది. కొమిరెడ్డిపల్లిలోని చాకలికుంటకు వరద వస్తుంది. ఆ చెరువు నిండుకొని చెన్నయ్య చెరువు నిండుతుంది. ఆ చెరువు నుంచి కూడా దిగువకు వరద వెళ్తుంది. అయితే కొమిరెడ్డిపల్లి వ్యవసాయ భూములు ఎక్కువగా ఆ రెండు చెరువుల పాటుకే ఉంటాయి. ఆయకట్టు మొత్తం సాగవుతుడడంతోపాటు వాగు శివారు, కాల్వ శివారు పొలాల రైతులు కూడా ఎక్కడికక్కడ మోటర్లు వేసి, అశకాశం ఉన్న వ్యవసాయ బోర్ల కింద సాగు చేస్తున్నారు. దీంతో నేడు కొమిరెడ్డిపల్లిలో సాగు పెరిగింది. సాగునీరు లేక పంటలు ఎండకుండా రైతులకు మంచి దిగుబడి వచ్చి లాభపడుతుండడంతో రైతు కుటుంబాలతోపాటు గ్రామం కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నది. అందుకు గ్రామ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సాగునీరు లేక చాలా మంది రైతులు పొలాన్ని అమ్ముకునేవారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సివిల్ ఇంజినీర్ కావడంతోపాటు రైతు కుటుంబంలో పుట్టడంతో ఎంతో మేలు చేసింది. ఆయన కృషితోనే మా గ్రామంలో చెక్డ్యాం వద్ద తూం ఏర్పాటు చేయించి సాగుకు పుష్కలంగా నీరు లభిస్తున్నది. దిగుబడి కూడా బాగా వస్తుండడంతో రైతులు ఆర్థికంగా లాభపడుతున్నారు. కరివెన ప్రాజెక్టు పూర్తయితే వందశాతం గ్రామాలకు సాగునీరు అందుతుంది. అభివృద్ధికి పాటుపడిన ఆల వెంకటేశ్వర్రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత రైతులపై ఉంది.
సీఎం కేసీఆర్ సహకారంతో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలతో సాగునీరు మూసాపేట పెద్దవాగు ద్వారా పారించాం. ఆ నీటితోనే మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లిలో వరి పుష్కలంగా పండి దిగుబడి బాగా వచ్చింది. ఆ ధాన్యాన్ని కొమిరెడ్డిపల్లి జాతీయ రహదారి పక్కనే ఉండే సర్వీస్ రోడ్డుపై రైతులు ఆరబోశారు. ఆ సమయంలో అటువైపు వెళ్లిన నా వద్దకు ఓ రైతు వచ్చి సారు ఇవి కేసీఆర్ వడ్లు సార్ అని సంతోషంతో, గర్వంగా చెప్పాడు. రైతులు ఆ మాట చెప్పడంతో మేం పడిన కష్టమంతా ఒక్క క్షణంలో మర్చిపోయాం. మరింత ఉత్సాహంతో పనిచేయాలనిపించింది. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రజలకు మరింత మంచి చేయాలన్నదే మా లక్ష్యం.