వనపర్తి, జూన్ 11: తెలంగాణ ఉద్యమంలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందించిన సహకారం ఎనలేనిదని, స్వరాష్ట్ర పాలన ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ మీద సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు భవిష్యత్తులో కూడా సహకరించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా సాహిత్య దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గంగిరెద్దుల నృత్యాలు, గిరిజన సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం ఆకట్టుకున్నాయి. అనంతరం పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సహకారం అందించిన సాహితీవేత్తలు, కళాకారులు, కవులను ప్రభుత్వం గుర్తుంచుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు సాహిత్య దినోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సురవరం ప్రతాపరెడ్డి మీద ఇప్పటికే రెండు సంపుటాలను ఆవిష్కరించానమని, సాహితీ దినోత్సవం సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మూడో సంపుటిని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. భావితరానికి ఈ సంపుటి విశేషంగా ఉపయోగపడుతుందని, ఇందులోని అంశాలు అత్యంత ప్రామాణికంగా పేర్చినట్లు పేర్కొన్నారు.
మూలగ్రంథాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంపుటాలను తయారు చేయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రచురితం కానివి, ఆయన రాసిన లేఖలు కుటుంబ సభ్యులతో ఏమైనా ఉంటే వాటిని ఇవ్వాలని, నాలుగో సంపుటిగా ప్రచురిస్తామని, అందుకు కుటుంబ సభ్యులు సహకరించాలని మంత్రి వివరించారు.భిన్నరంగాల్లో విన్న సామాజిక భాష్పాలతో సి. నారాయణరెడ్డి వేసిన ముద్రణ ఎంతో బలమైనదని, ఒక కళాశాల అధ్యాపకుడిగా, విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా, భాషా సాంస్కృత్రిక శాఖ, తెలుగు అకాడమీ అధ్యక్షుడిగా పని చేయడంతోపాటు సినీరంగంలో తనదైన ముద్రణ వేశారన్నారు. తెలంగాణ సాహిత్యంలో ప్రస్తుతం సినారె పాత్ర పూరించేవారు ఎవరు లేరన్నారు.
కరువుపై పాటలు పాడినం
కష్టాలు, కరువుకాటకాల మీద పాటలు పాడినం మలిదశ ఉద్యమంలో సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు తెలంగాణలోని కరువు, కాటకాల మీద పాటలు పాడడం, ధూంధాం వంటి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నట్లు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ పేర్కొన్నారు. స్వరాష్ట్ర పాలనలో ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగానే దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తెలుగు భాషలో ప్రేమ
తెలుగు భాష లోనే ప్రేమ దాగి ఉందని, పాటలు పాడినా, కవిత్వాలు విన్నా, చదివినా మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుందని, అలాంటి తెలుగును నేను నేర్చుకున్నానని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సాహితీ దినోత్సవంలో భాగంగా కవులు రాసిన కవిత్వాలను చదివి వినిపిస్తుంటే వారికి భాష మీద ఆప్యాయత కనిపిస్తుందన్నారు. సాహితీ దినోత్సవం సందర్భంగా కవులు చదివిన ప్రతి కవితను పుస్తక రూపంలో ముద్రించేలా చర్యలను తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, జిల్లా అధికారులు, సురవరం, సినారె కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.