పెబ్బేరు/మదనాపురం, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనాలకు వస్తున్న స్పందనను చూసి ప్రతిపక్షాలకు పాలుపోవడంలేదన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతుండడం, కార్యక్రమాలు విజయవంతం అవతుండడం వారికి మింగుడుపడటం లేదని ఎద్దేవా చేశారు. విశ్వాసం పొందిన పార్టీలనే ప్రజలు ఎన్నుకుంటారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన జీవనాన్ని కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. వ్యక్తి, సమాజ సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే పురోభివృద్ధి సాధించిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు అమలవుతుండడంతో సంక్షేమ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారన్నారు.
ఇప్పటివరకు తన చేతుల మీదుగా 12వేల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 8వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఒకప్పుడు 24వేల మందికి కేవలం రూ.రెండువందలు ఫించన్లు మాత్రమే వస్తుండగా, ప్రస్తుతం 47వేలమందికి రెండువేల చొప్పున పింఛన్ అందుతున్నదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు పొందని కుటుంబమంటూ లేదని.. వచ్చే ఎన్నికల్లో వారు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గంలో 99వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల వారికి తాను ప్రభుత్వపరంగా లబ్ధి చేకూర్చామన్నారు. నియోజకవర్గంలో 21 చెక్డ్యాంలు నిర్మించానని, మరో 9 చెక్డ్యాంల మంజూరుకు సీఎం కేసీఆర్ను కోరినట్లు ఆల తెలిపారు. ఈ సందర్బంగా 57మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, నలుగురికి రైతుబీమా చెక్కులు పంపిణీ చేశారు.
అంతకుముందు మదనాపురం పురవీధుల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీ చేశారు. ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల, దేవరకద్ర మహిళా అధ్యక్షురాలు జయంతి, ఎంపీపీ పద్మావతి, వైస్ఎంపీపీ యాదమ్మ, జెడ్పీటీసీలు కృష్ణయ్య, రాజశేఖర్రెడ్డి, స్థానిక సర్పంచ్ రాంనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, మార్కెట్కమిటీ చైర్మన్ శ్రావణ్కుమార్రెడ్డి, మాజీ చైర్మన్ వెంకట్నారాయణ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రవీందర్రెడ్డి, మండల కోఆర్డినేటర్ హనుమాన్రావు, కురుమూర్తి పాలకమండలి సభ్యుడు గోపిస్వామి, కోఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, ఆయ గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.