పాలమూరు, జూలై 2 : మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్న రోప్వేను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక అధ్యయనంలో భాగంగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి ఆ దేశంలోని యూసూ నగరంలో ఉన్న ప్రఖ్యాత కేబుల్ కార్ రోప్ వేను సందర్శించారు. పర్యటనలో భాగంగా కేబుల్ కార్ను పరిశీలించి అందులో ప్రయాణించారు. ప్రస్తుతం మన్యంకొండ వద్ద ఉన్న రోప్వే స్విట్జర్లాండ్ తరహాలో అద్భుతంగా చేపడతామని తెలిపారు. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించడమే లక్ష్యంగా మన్యంకొండ రోప్వే నిర్మాణం ఉండనున్నదన్నారు.
కొండ దిగువన అలివేలు మంగ ఆలయం, మెయిన్రోడ్డుకు కుడివైపు నుంచి కొండపైకి సుమారు కిలోమీటరు మేర రోప్వే నిర్మించనున్నట్లు వివరించారు. ఈ రోప్వే వల్ల పర్యాటకులు, భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కొండ దిగువన పర్యాటకుల సౌకర్యం కోసం పెద్ద హరిత పర్యాటక హోటల్ కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంత ఖర్చు అయినప్పటికీ పేదల తిరుపతి మన్యంకొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలు, ఎకో టూరిజం కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు తెలంగాణ ఎంతో గుర్తింపు పొందిందన్నారు.
సీఎం కేసీఆర్ పర్యాటక అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, ఫలితంగానే అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ మానేరు రివర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్లు, హైదరాబాద్ ట్యాంక్బండ్, మహబూబ్నగర్ ట్యాంక్బండ్ సహా రాష్ట్రంలోని పలుచోట్ల పర్యాటక సొబగులను పెంచేందుకు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. మంత్రి వెంట నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ ఉన్నారు.