వనపర్తి, అక్టోబర్ 1: తెలంగాణ కోసం పోరాడి సాధించిన, అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని మాదాపూర్ ప్లాటినం హైట్స్లో హైదరాబాద్లో నివసిస్తున్న 2,500 మంది వనపర్తి వాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయ న పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగించేలాంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఐదేండ్లకోసారి వచ్చే కాంగ్రెసోల్లు సంక్రాంతి గంగిరెద్దులలాంటి వారని, వారి చెప్పే హామీలను నమ్మి ఓటేస్తే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారన్నారు. గతంలో జిల్లాలోని పల్లెల నుంచి పట్టణ, ఇతర రాష్ర్టాలకు వలసులుండేవని.. నేడు ఆగి.. తిరిగి వాళ్ల గ్రామాలకు వస్తున్నారని, ఒకప్పుడు మాదిరిగా గ్రామాలు కాల్వలలో సాగునీరు పారడంతో పచ్చని పంటలు వెల్లువిరుస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్లో స్థిరపడ వారంతా తెలంగాణ వచ్చిన తరువాత గ్రామాల్లో వచ్చిన మార్పులను గుర్తించాలని సూచించారు. ఒకప్పుడు తాగునీరు లేక తల్లడిల్లిన స్థితి నుంచి నేడు మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తామన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో వనపర్తి జిల్లాగా అయిందని, దానికి తగ్గట్టుగా సీఎం కేసిఆర్ ఆశీస్సులతో అనేక పథకాలను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఒకప్పుడు వనపర్తిలో డిగ్రీ సీటు దొరకక ఒక ఏడాది చదువులు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉండేవని, వచ్చిన ఇంజినీరింగ్ కళాశాలను నిలుపుకొలేని నాయకులు మన ప్రాంతాన్ని పరిపాలించారని ఎద్దేవా చేశారు. నేడు వనపర్తికి మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, వ్యవసాయ, మత్స్య కళాశాలను ఏర్పాటు చేసుకొవడమే కాక ఐటీ హాబ్ టవర్ ఏర్పాటుకు శంకుస్థాపనలు కూడా చేసుకున్నామన్నారు. ఉన్నత చదువులకు దూరంగా వెళ్లి భారమైన చదువులకు ఇబ్బంది లేకుండా మన ప్రాంతంలోనే గొప్పగా చదువుకొనే స్థితికి తీసుకొచ్చామన్నారు. పట్టణ కేంద్రంలో రోడ్డు వెడల్పులో భాగంగా పట్టణం అద్భుతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. పట్టణ కేంద్రంలోని నలువైపులా ఉన్న చెరువు కట్టలను సుందరీకరణ చేసుకొని ట్యాంక్ బండ్ను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. కార్యక్రమంలో హైదరాబాద్లోని వనపర్తి నివాసప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.