నారాయణపేట, ఏప్రిల్ 11 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రైతన్న తలెత్తుకొని బతుకుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ దేశంలో యాసంగి సీజన్లో 95 లక్షల ఎకరాల్లో పంటలు పండితే.. ఒక్క తెలంగాణలోనే 56.46 లక్షల ఎకరాలు సాగైందన్నారు.
కర్ణాటకలోని ఉత్తరభాగం, మహారాష్ట్రలోని పశ్చిమ భాగం, గుజరాత్లోని సగానికి సగం భూములు బీళ్లుగా ఉన్నాయన్నారు. రైతులు తిరగబడడంతో మోదీ సర్కార్ ముక్కు చెంపలేసుకొని నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలన్న సోయి కేంద్రానికి లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, కొత్త రైల్వేస్టేషన్ల నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.150 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం చేసినా.. మూడేండ్లలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మగాడు, మొనగాడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నారాయణపేట జిల్లాలో ఒక్క విడుతలో రూ.596 కోట్ల రైతుబంధు సాయం ఖాతాల్లో జమవుతుందన్నారు.
అధికారికంగా ఎలాంటి అభివృద్ధి పథకాలను మంజూరు చేయకుండా.. కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టేందుకే పీఎం మోదీ రాష్ర్టానికి వచ్చాడని మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్ర నీటి వాటాను తేల్చకుండా తొమ్మిదేండ్లుగా నాన్చుతున్నదన్నారు. విభజన హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చడం లేదన్నారు. అట్టడుగున చేరిన ఆర్థిక వ్యవస్థ, రూపాయి క్షీణత, రుణాల ఎగవేతదారుల గురించి ప్రశ్నిస్తే కేంద్రం ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని దాడులు చేస్తుందన్నారు. ఒకవైపు బీజేపీ నాయకులు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, మరోవైపు దేశంలో ఉత్తమ అవార్డులన్నీ తెలంగాణకే వస్తున్నాయన్నారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేటలో అగ్రికల్చర్, పాటిటెక్నిక్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.
మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు..
బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కమిటీలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. దీంతో పేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఎస్సీ మహిళ బాధ్యతలు తీసుకున్నదన్నారు. రైతులు కంటి నిండా నిద్రపోయే పాలన అందుతున్నదన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే గొం తులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అధికారికంగా వచ్చి రాజకీయంగా మాట్లాడడం తగదని మోదీపై ధ్వజమెత్తారు. లీకేజీలను ప్రోత్సహించేందుకు, దాడులను ప్రేరేపించేందుకు మోదీ తెలంగాణ ప ర్యటనకు వచ్చారే తప్పా మరొకటి లేదన్నారు.
మతం, కులం అని ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జై జవాన్, జై కిసాన్ అని నినాదాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. రైతుబీమా, రైతుబంధు, 24 గంటల కరెంట్ వంటి అనేక పథకాలను తీసుకొస్తే కేంద్రం మాత్రం బడాబడా వ్యాపారులకు ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తుందన్నారు.
కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రతిఘటిస్తామన్నారు. రాబోయేది రైతు రాజ్యమేనని.. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ రావాలని, నవ భారత నిర్మాణానికి ప్రతిఒక్కరూ నాంది పలకాలన్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయించి.. నారాయణపేట మెయిన్ కెనాల్ ద్వారా సాగునీరు తీసుకొస్తామన్నారు. కులమతాల పేరిట రాజకీయాలు చేసే పార్టీలను నమ్మొద్దన్నారు. పేట వ్యవసాయ మార్కెట్ యార్డు 1952లో ఏర్పాటైందని, 2002లో పదకొండున్నర ఎకరాల్లో 47 షాపులతో నూతన మార్కెట్ రూపుదిద్దుకున్నదన్నారు.
ఈ ఏడాది మార్కెట్ యార్డు లక్ష్యం రూ.3.60 కోట్లు ఉంటే.. రూ.5 కోట్లకు పూర్తి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మొసట్ జ్యోతి మాట్లాడుతూ జయమ్మ చెరువు నింపాలన్న ఎమ్మెల్యే కలను సాకారం చేసేందుకు సహకరించాలని కోరారు. అంతకుముందు నూతన పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో కలెక్టర్ శ్రీహర్ష, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, జెడ్పీ వైస్చైర్పర్సన్ సురేఖ, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీకాంత్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్ తదితరులు పాల్గొన్నారు.