Edula Reservoir | మహబూబ్నగర్, జూన్ 16 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏదుల పంప్హౌస్కు కనెక్టివిటీ చేస్తూ 400 కేవీ విద్యుత్ లైన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా శుక్రవారం విద్యుత్ సరఫరా సాఫీగా సాగింది. దీంతో ఏదుల రిజర్వాయర్కు నీటి పంపింగ్ మార్గం సుగమమైంది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను అభినందించారు. సీఎం ఇచ్చిన 14రోజుల టార్గెట్కు ముందే అడ్డంకులను అధిగమించడం గమనార్హం. ఇటీవల మంత్రి నిరంజన్రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఏదుల పంపింగ్ స్టేషన్ను సందర్శించి జూలై ఆఖరు నాటికి నీరందించేలా పంపులు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మే 6న మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతినిధుల బృం దం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న అన్ని రిజర్వాయర్లను సందర్శించారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి ఏదుల పంపింగ్ స్టేషన్ వద్ద నిర్మించిన 400 కేవీ సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా విజయవంతంగా పూర్తి చేశారు.
నల్లగొండ జిల్లా డిండి నుంచి 400 కేవీ సబ్స్టేషన్ నుంచి ఏదుల పంపింగ్ స్టేషన్ వరకు హైటెన్షన్ విద్యుత్ లైన్ను కొత్తగా నిర్మించారు. 60కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్ను కూడా చార్జి చేయడం జరిగిందని ఇరిగేషన్ సీఈ వివరించారు. విద్యుత్ సరఫరా విజయవంతంగా ఏదుల పంప్హౌస్కు చేరడంతో ఇక్కడి పంపింగ్ స్టేషన్ పంప్లను నడపడానికి మార్గం సుగమమైంది. త్వరలోనే ఏదుల పంప్హౌస్లో పంప్ల డ్రై రన్ నిర్వహిస్తామని నీటి పారుదలశాఖ సీఈ హమీద్ఖాన్ వెల్లడించారు.
రెండు విద్యుత్ సబ్స్టేషన్ల మధ్య విజయవంతంగా విద్యుత్ సరఫరా జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోన్లో ఇంజినీరింగ్ అధికారులను అభినందించారు. త్వరలో పంప్హౌస్లను ట్రయల్ రన్ నిర్వహించి నిర్దిష్ట గడువులోగా రిజర్వాయర్ నింపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో సీఈ శ్రీరాంనాయక్, సీఈ లతావినోద్, ఎస్ఈలు విజయ భాస్కర్రెడ్డి, మాణిక్యరావు, ఈఈలు రాము, రవీందర్, మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, డీఈలు సత్యనారాయణ గౌడ్, దశరథ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.