అలంపూర్, ఫిబ్రవరి 19 : అమ్మా.. జోగుళాంబదేవీ రాష్ట్ర ప్రజలను ఎప్పుడూ చల్లంగా చూడాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వేడుకున్నారు. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం ఆయన దర్శించుకొన్నారు. అంతకుముందు ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ చిన్ని కృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి బాలబ్రహ్మేశ్వరస్వామికి అభిషేకం, జోగుళాంబ దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు శేషవస్ర్తాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం పలికారు.
అనంతరం ఆలయాల సమీపంలోని షా-అలీ పహీల్వాన్ దర్గాను కూడా దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి వెంట ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ రితిరాజ్తోపాటు ఆలయ అధికారులు, అర్చకులు, పలువురు నాయకులు ఉన్నారు.