మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు అప్పనపల్లి సమీపంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో మినీ జూ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. మినీ జూ ఏర్పాటుకు మంత్రి రాష్ట్ర స్థాయిలో ఫారెస్ట్ ,ఇతర అధికారులతో మాట్లాడి అందుకు తగ్గ అనుమతులు కూడా వచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మినీ జూ ఏర్పాటు విషయమై మంగళవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ముఖ్యంగా మినీ జూ ఏర్పాటుకు అవసరమైన ప్రణాళిక తయారీ, టెండర్లు పిలవడం, డిజైనింగ్ తదితర అంశాలపై జిల్లా ఫారెస్ట్ అధికారి గంగారెడ్డి తో పాటు, ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. మినీ జూ ఏర్పాటుకు రాజ్యసభ సభ్యుడు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మినీ జూలను అధ్యయనం చేసిన మీదట ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకుగాను అవసరమైన ప్రణాళికను తయారు చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుమతి పొందిన తరువాత పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టాలని డీఎఫ్ ఓను ఆదేశించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,తదితరులు ఉన్నారు.