గద్వాలటౌన్, సెప్టెంబర్ 22: అనుమతులు లేకుండా నిర్వహించే దవాఖానలు, ల్యాబ్లు, క్లీనిక్లను సీజ్ చేస్తామని డీఎంహెచ్వో చందూనాయక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని దవాఖానలు, క్లీనిక్లు, ల్యాబ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు, నర్సులు తప్పనిసరి ఉండాలన్నారు. ఎవరి పేరు మీద అనుమతులు తీసుకున్నా రో నిర్వహణలో వారే ఉండాలన్నారు. బయోవేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటించాలన్నారు. అలాగే ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని సూచించారు. ఏ ఇతర వైద్యసేవలు అందించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దవాఖానల తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అయిజ, సెప్టెంబర్ 22: ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్వో సిద్ధప్ప హెచ్చరించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, డీఎంహెచ్వో చందూనాయక్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని శ్రీనివాస, భువనేశ్వర, కృష్ణవేణి తదితర నర్సింగ్ హోంలను జిల్లా వైద్య బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, సౌకర్యాలను పరిశీలించారు. అర్హత కలిగిన డాక్టర్లతోనే రోగులకు వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతేనే వైద్య పరీక్షలకు రెఫర్ చేయాలని, అవసరంలేకపోయనా వైద్య పరీక్షలకు రెఫర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక ఫీజులను వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే ప్రభుత్వ అనుమతులు రద్దు చేస్తామన్నారు. అనుమతులు లేకుండా నర్సింగ్ హోంలు, వైద్యశాలలను నిర్వహించరాదన్నారు. నర్సింగ్ హోంలలో రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సౌకర్యాలు లేని వైద్యశాలలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిత్యం ప్రైవేట్ దవాఖానలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు వెల్లడించారు. పరిశీలనలో జిల్లా ప్రోగాం అధికారి ఇర్షాద్, సీహెచ్వో రామకృష్ణ, ఎన్సీడీ కోఆర్డినేటర్ శ్యాంసుందర్, ఎంపీహెచ్ఈవో ఓబులేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
గద్వాలటౌన్, సెప్టెంబర్ 22: జిల్లాలలోని ప్రైవేట్ దవాఖనలు, నర్సింగ్హోమ్స్, క్లీనిక్లు, ల్యాబ్ల్లో బుధవారం వైద్య బృందం తనఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా డిప్యూటీ డీఎంహెచ్వో సిద్ధప్ప, మాతా శిశు సంరక్షణ అధికారి శశికళ జిల్లా కేంద్రంలోని ల్యాబ్లు, రికార్డులను పరిశీలించారు. చట్టరీత్యా, ప్రభుత్వం నిబంధనల మేరకు అన్ని అనుమతులు తప్పనిసరి ఉండాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకోవడమే కాకుండా సీజ్ చేయాల్సి వస్తుందన్నారు. అనుమతులు ఎవరిపేరు మీద తీసుకున్నారో నిర్వహణలో వారే ఉండాలని చెప్పారు. క్వాలిఫైడ్ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే ఉండాలన్నారు. లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రోగ్రాం అధికారి మారుతీనందన్గౌడ్, డాక్టర్లు ఇర్షాద్, రవికుమార్, వైద్య సిబ్బంది రామకృష్ణ, మధుసూదన్రెడ్డి, నర్సింహులు, శ్యాంసుందర్ మరికొన్ని దవాఖానల్లో తనిఖీలు నిర్వహించారు.