మార్కండేయ రిజర్వాయర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బిజినేపల్లి మండలం శాయిన్పల్లి శివారులో రూ.77 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. రిజర్వాయర్ ప్రాంతంలో రింగ్బండ్ పనులు 90 శాతం పూర్తవగా.. 500 మీటర్ల గ్రావిటీ పూర్తికావొచ్చింది. ఎంజీకేఎల్ఐ కాల్వ వద్ద మోటర్ల సాయంతో నీటిని లిఫ్ట్ చేసి కీమ్యాతండా సమీపంలో అర టీఎంసీ సామర్థ్యంతో సింహారెడ్డి కుంటను నింపనున్నారు. నీటి పంపింగ్తో శాయిన్పల్లి, పోలేపల్లి కుడి ఎడమ కాల్వల్లో కృష్ణా జలాలను పారించి సాగునీరు అందించనున్నారు. దీంతో ఐదు గ్రామాలు, 17 తండాల పరిధిలోని 7,310 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కృషితో పనులు చకచకా జరుగుతుండగా.. రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బిజినేపల్లి, జూలై 15: బిజినేపల్లి రైతు దశను మార్చే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఊపందుకున్నాయి. పొలాలకు నీరందక సతమతమవుతున్న తరుణంలో 2022లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కాగా ప్రస్తుతం రిజర్వాయర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత పాలకులు కేఎల్ఐ కాల్వను బిజినేపల్లి మండలంలో కిలోమీటర్ల మేర తీసుకెళ్లారు కానీ కాల్వకు ఎత్తు ప్రాంతంలో ఉన్న పొలాలకు నీరందించలేకపోయారు. దీంతో నాటి నుంచి నేటి వరకు పక్కనే కృష్ణమ్మ పారుతున్నా పంటలకు సాగునీరు అందక రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో సాగుకు నోచుకోని భూములన్నీ బీళ్లుగా మారాయి. కేవలం వర్షాధార పంటలను మాత్రమే పండించేవారు. మిగిలిన గ్రామాలు, తండాలకు చెందిన పొలాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో పట్టు వీడని విక్రమార్కుడిలా ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో కొట్లాడి మార్కండేయ రిజర్వాయర్ను మంజూరు చేయించారు. మొదట 130 ఎకరాల్లో ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉండగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏడెకరాల నష్టంతోనే పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి శివారులోని కేఎల్ఐ కాల్వ 22.7 కిలోమీటర్ల వద్ద మోటర్లను ఏర్పాటు చేసి లిఫ్ట్ ద్వారా కీమ్యాతండా సమీపంలోని సింహారెడ్డి కుంటను అర టీఎంసీ నీటితో నింపేలా రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు.
ఈ ప్రాంతంలో రింగ్బండ్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అదేవిధంగా గ్రావిటీ కెనాల్ 500 మీటర్లు పూర్తి కావచ్చింది. ఈ రిజర్వాయర్ను కృష్ణమ్మ నీటితో నింపిన వెంటనే శాయిన్పల్లి, పోలేపల్లి కుడి, ఎడమ కాల్వల ద్వారా పొలాలకు సాగునీటిని అందించనున్నారు. రిజర్వాయర్కు సంబంధించి మూడు కిలోమీటర్ల మేర పైపులైన్, రెండు కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్ పనులు పూర్తి కాగా, పైప్లైన్ కాల్వ పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తవడంతో చుట్టుపక్కల గ్రామాలు, తండాలు సస్యశ్యామలం కానున్నాయి. ఎన్నో ఏండ్లుగా సాగునీటి కోసం ఎదురుచూసిన రైతుల కల నెరవేరనుంది. బీడు భూములు కృష్ణా జలాలతో తడవడం ద్వారా వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ రిజర్వాయర్ పనులు పూర్తయితే నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి, గంగారం, లట్టుపల్లి, మమ్మాయిపల్లి, పోలేపల్లి గ్రామాలతోపాటు వసురాంతండా, పెద్దతండా, కేతరిబండ తండా, కీమ్యాతండా, పెద్ద హేమ్లాతండా, ఎర్రకుంట తండా, అలుగుతండా, బద్యానాయక్తండా, ఇప్పలతండా, రావులచెరువుతండా, బొడుసుగడ్డ తండా, చిన్నపీర్ తండా, పీర్యాతండా, ఫుల్సింగ్తండా, భీముని తండా, కాట్రావత్ తండా, నల్లగడ్డ తండా, శాయిన్పల్లి తండాలకు సాగునీరు అందనున్నది.
అదేవిధంగా వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని సోలీపూర్, జంగమాయిపల్లి, రుక్కన్నపల్లి, షాపూర్, కర్నెతండా, దొంతిగుంటతండా, ఆమోదంబండ తండా, గరయ్యబండతండా, కుంటముందరి తండా, పోతులకుంట తండా, ఎర్రగడ్డ తండా, పామ్రెడ్డిపల్లి తండాలకు చెందిన పొలాలకు సాగునీరు అంది సస్యశ్యామలం కానున్నాయి. కేఎల్ఐ కాల్వ ద్వారా లక్షకుపైగా ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే 8వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందనున్నది. దీంతో పల్లెలు, తండాలు అభివృద్ధి చెందడంతోపాటు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేఎల్ఐ ద్వారా వచ్చిన నీటిని మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేసిన చెరువులు, కుంటలను నింపి సాగుకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా మండలంలోని వడ్డెమాన్, ఖానాపూర్, పాలెం, పెద్దచెరువులతోపాటు ఇతర గ్రామాలు, తండాల్లో ఉన్న కుంటల్లో నీటిని నింపి పంటల సాగుకు అందించనున్నారు. ఈక్రమంలో గతానికి మించి సాగు విస్తీర్ణం పెరుగనున్నది.
నీరు పుష్కలంగా ఉండడంతో చేపపిల్లలను పెంచుకొని విక్రయిస్తూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
‘మార్కండేయ’ను పూర్తి చేసి సాగునీరందిస్తాం
మార్కండేయ రిజర్వాయర్ను పూర్తి చేసి పొలాలకు సాగునీటిని అందిస్తాం. కేఎల్ఐ నీరు అందని గ్రామాల కోసం సీఎం కేసీఆర్ వద్ద విన్నవించి మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చాం. ఈ రిజర్వాయర్ను పూర్తి చేసి మండలంలోని ఐదు గ్రామాలు, 17 తండాల్లోని భూములకు సాగునీరు అంందిస్తాం. ఇప్పటికే రింగ్బండ్, ఓపెన్ కెనాల్, పంప్హౌస్ పనులు వేగంగా సాగుతున్నాయి. మిగతా పనులను త్వరగా పూర్తి చేయిస్తాం. రైతుల పొలాలకు కృష్ణమ్మ నీటిని అందించేంత వరకు ప్రాజెక్టు వద్ద కుర్చీలో కూర్చొని అయినా హామీని నిలబెట్టుకుంటా.
– ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
సాగునీరు వస్తుండడం సంతోషం
మార్కండేయ రిజర్వాయర్ ద్వారా మా పొలాలకు సాగునీరు రావడం సంతోషంగా ఉంది. గతంలో కండ్ల ముందే కేఎల్ఐ కాల్వలో నీరు పారుతున్నా మా పొలాలకు అందక కన్నీళ్లు పెట్టుకున్నాం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కృషితో మా పొలాలకు సాగునీరు
అందనున్నది.
– గోవిందు, చిన్నపీర్తండా
బీడువారిన పొలాలు సాగులోకి..
మార్కండేయ రిజర్వాయర్ పూర్తయితే బీడువారిన భూములు సైతం సస్యశ్యామలం కానున్నాయి. గతంలో కేవలం వర్షాలపై ఆధారపడి పంటలను సాగు చేసేవాళ్లం. కాలం సరిగ్గా కాకపోతే పెట్టిన పెట్టుబడులు సైతం రాకపోయేవి. ఈ రిజర్వాయర్ ద్వారా నీరు అందితే రెండు పంటలు సాగు చేసుకొని మంచి దిగుబడి పొంది ఆర్థికంగా బలపడతాం.
– శాంతయ్య, పోలేపల్లి, బిజినేపల్లి మండలం