మల్దకల్, డిసెంబర్ 3: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మల్దకల్ ఆదిశిలాక్షేత్రానికి ప్రాధాన్యత ఉన్నది. ఏటా మార్గశిరమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్గశిరమాసంలో వచ్చే పౌర్ణమికి స్వామివారి రథోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. ఇక్కడ వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి మల్దకల్ తిమ్మప్పగా పేరు గాంచాడు. ఈ ప్రాంతంలో రుద్రుడు(శివుడు) తపస్సు చేసినందున వేంకటేశ్వరస్వామి వెలిసినట్లు పురాణాలు. ఈ ప్రాంతాన్ని రుద్రభూమిగా కూడా పిలుస్తారు. అందరూ తిరుమల కొండకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటే మల్దకల్, పెద్దొడ్డి గ్రామాల ప్రజలు మాత్రం తిమ్మప్పను తిరుమల వేంకటేశ్వరస్వామితో సమానంగా కొలుస్తారు. ఉత్సవాలను తిలకించడానికి గద్వాల, కర్నూలు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు.
వానకాలంలో రైతులు పండించిన బియ్యాన్ని కొత్తకుండలో వండి తిమ్మప్పస్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఏటా మార్గశిరమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సోమవారం బోడిప్రభ, రాత్రికి హనుమత్వాహన సేవ, 6వ తేదీ రాత్రి 11గంటలకు కల్యాణోత్సవం, గరుడ ప్రభోత్సవంపై ఊరేగింపు, 7న పుష్కరిణిలో హంసవాహనంపై తెప్పోత్సవం, శేషవాహనంపై ఊరేగింపు, 8న రాత్రి 12గంటలకు స్వామివారి రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గద్వాలకు 17కిలోమీటర్ల దూరంలో, అయిజకు 12కిలో మీటర్ల దూరంలో మల్దకల్ తిమ్మప్పక్షేత్రం ఉన్నది. జాతరకు గద్వాల, కర్నూలు, వనపర్తి, రాయిచూర్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.