అలంపూర్ చౌరస్తా, మే 22 : ఆరుగాలం రైతన్న కష్టమంతా నీటిపాలైయింది. రాష్ట్ర సర్కారు అసమర్థ పాలన, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మక్క రైతన్నలకు ఆఖరికి కన్నీటి వ్యథను మిగిల్చింది. పంట కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం సకాలంలో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో చేతికందిన మక్కలు వర్షార్పణమయ్యాయి. మొన్నటి వరకు గన్నీబ్యాగులు, హమాలీలు, లారీలు అంటూ రైతులను వేధించి రోజులు గడిచిన మక్క బస్తాలను తరలించకపోవడంతో అకాల వర్షానికి రైతులు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఇదురుగాలులు, వర్షానికి ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మక్కలు మొత్తం తడిసిముద్దవ్వడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నేడు రైతులకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
35 రోజుల కిందట ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే రైతులకు కనీసం ప్రభుత్వం గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. కాంటాలు వేసిన మక్క బస్తాలను పూర్తిస్థాయిలో తరలించలేదు. ఫలితంగా గురువారం కురిసిన భారీ వర్షానికి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఇది ప్రభుత్వ పాపామేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయని ఏ క్షణంలోనే వర్షాలు కురుస్తాయని మక్క బస్తాలను తరలించాలని ఎన్నో మార్లు అధికారుల ముందు మొరపెట్టుకున్నా, ఆందోళనలు చేసిన రైతులను పట్టించుకున్న పాపానపోలేదని, తీరా భారీ వర్షానికి మక్కలు తడిసిపోయి మొలకలు రావడంతో ఈ పాపం ఎవరిదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో, యార్డుల్లో 30శాతంపైగా మక్క బస్తాలు ఉన్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
20 రోజుల కిందట మొక్కజొన్న పంటను అమ్ముకుందామని అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రానికి పంట తీసుకొచ్చాను. పంటను కొనుగోలు చేయాలని ప్రతి రోజూ అధికారులకు వేడుకుంటున్నా ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదు. 15రోజుల కిందట మక్కలను బస్తాలో నింపి కాంటా వేశారు. అయితే గోదాముల్లోకి తరలించలేదు. ఎక్కడ వర్షం పడుతుందోనాని ప్రతి రోజూ పంట వద్ద కాపలాకాస్తూ నర కం అనుభవిస్తున్నా. ఒకపూట తిని ఒకపూట తినక పంట వద్ద ఉంటున్నా. నా సీరియల్ నెంబర్ వచ్చినా మక్క బస్తాలను లారీల్లో ఎక్కించలేదు. నా తర్వాత వచ్చిన వారివి లారీల్లో ఎక్కించారు. ఎందుకు అని అడిగితే మా ఇష్టం వచ్చినప్పుడు నీ బస్తాలను గోదాంకి తరలిస్తామని అంటున్నారు. దీంతో సంచుల్లో ఉన్న మక్కలు చాలా వరకు మొలకలు వచ్చాయి. ఇప్పుడు నష్టం వస్తే ఎవరు భరిస్తారు కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే మాలాంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
– శాలన్న, మక్క రైతు, సాతర్ల, ఇటిక్యాల మండలం