పెబ్బేరు, ఏప్రిల్ 12 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ (ఎన్టీఆర్) కాల్వ వట్టిపోయింది. ప్రతి వేసవిలో నీటి సరఫరా నిలిపివేసినా అక్కడక్కడా నీళ్లు కనిపించేవి. కానీ ఈ సారి మాత్రం చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఎండల నేపథ్యంలో ఈ పరిస్థితి దాపురించిందని జూరాల ఆయకట్టు రైతులు అంటున్నారు. గద్వాల జిల్లా జూరాల డ్యాం నుంచి ప్రారంభమయ్యే ఈ కాల్వ వనపర్తి జిల్లా మీదుగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు ప్రయాణిస్తుంది. మూడు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరందిస్తూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న జూరాల ప్రధాన కాల్వ ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నది. కృష్ణానదిలో నీటి జాడలు కరువై కళ తప్పింది. కేసీఆర్ ప్రభుత్వంలో గతేడాది పచ్చని మాగాణుల్లో దర్శనమిచ్చిన పొలాలు నేడు బీడు భూములుగా మారాయి. ఇప్పటికే జూరాల కింద క్రాప్హాలీడే ప్రకటించడంతో పచ్చని పైర్లు మాయమయ్యాయి.