మహబూబ్నగర్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృషి, పట్టుదల, జీవితంలో ఏదైనా సా ధించాలనే తపన ఉంటే విజయం మనదేనని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో మంగళవారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణటుడే’ ఆధ్వర్యంలో, ‘శాంతానారాయణగౌడ్ ట్రస్ట్’ సౌజన్యంతో ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సదస్సుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఉద యం 11:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వక్తలు సందేహాలను నివృత్తి చేశారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ మల్లవరపు బాలలత, వేపా అకాడమీ డైరెక్టర్ డా.సీఎస్ వేపా ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి..? చదివిన వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి..? అనే దానిపై వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, డీఈవో రవీందర్, నమస్తే తెలంగాణ ఆన్లైన్ వెబ్ ఎడిషన్ ఇన్చార్జి వేమారెడ్డి, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ డీ డీలు యాదయ్య, ఇందిర, శంకరయ్య, ఎక్స్పో ప్లాజా ఇన్చార్జి విజయ్కుమార్, నమస్తే తెలంగాణ మహబూబ్నగర్ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, ఎడిషన్ ఇన్చార్జి సత్యనారాయణరెడ్డి, ఏడీవీటీ ఇన్చార్జి విజయ్కుమార్, సర్క్యూలేషన్ ఇన్చార్జి జగన్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, ఈవెంట్ మేనేజర్ గణేశ్, టీఆర్ఎస్ నాయకుడు సుదీప్రెడ్డి పాల్గొన్నారు.
సాహసం చేయకపోతే సాధించలేం..
చిన్నప్పుడే పోలియో వచ్చింది. కాళ్లు చచ్చుబడి పోయాయి. అయినా కుంగిపోలేదు. మా నాన్న ఒక్కటే చెప్పారు.. సాహసం చేయరా ఢింబకా అని.. ఆ ఒక్క మాట నా జీవితాన్నే మలుపుతిప్పింది. పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యాను. ఈ ఉద్యోగం ఉంటే నేను మాత్రమే సేవ చేస్తాను.. అదే నాలాంటి వాళ్లకు అండగా నిలబడితే ఎంతో మంది ద్వారా అనుకున్నది సాధిస్తాననే ఆలోచనతో ఉద్యోగాన్ని వదిలి కోచింగ్ సెంటర్వైపు అడుగులు వేశాను. సాహసం చేయకపోతే ఏదీ సాధించలేం. చిన్నప్పటి నుంచి బంధువులు, చుట్టుపక్కల వాళ్ల నుంచి అనేక సూటిపోటి మాటలు ఎదుర్కొన్నా. ఇంకా కసితో, పట్టుదలతో చదివాను. సివిల్స్కు ప్రిపేరై ఐఏఎస్ కావాలన్న గోల్ పెట్టుకున్నాను. ఇంగ్లిష్ రాదు.. పక్కన డిక్షినరీ పెట్టుకొని ప్రతిపదాన్ని అర్థం చేసుకున్నా. ప్రిలిమ్స్, మెయిన్స్ పాసయ్యాను. ఇక ఇంటర్వ్యూలో ఎలా నెగ్గుకురావాలి..? అనుకొని ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అది మూడో అంతస్తులో ఉంది.
అయినా మా నాన్నే నన్ను పైకి తీసుకెళ్లి మళ్లీ కిందకు తీసుకొచ్చే వారు. అంత సాహసంతో చదివినందునే ఇంటర్వ్యూ కూడా పాసై 367 ర్యాంకు తెచ్చుకున్నాను. ఉద్యోగం రావడానికి రెండున్నర ఏండ్లు పట్టింది. ర్యాంకు రావడంతో మా ఇల్లంతా విద్యార్థులతో నిండిపోయేది. ట్యూషన్లు చెప్పమని వెంటపడేవారు.నాకు ఇతరులకు సాయం చేసే అవకాశం ఇవ్వాలని అప్పుడే దేవుడిని వేడుకున్నా. చెన్నైలో ఉద్యోగం వచ్చింది. ఐదేండ్ల తరువాత హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. మళ్లీ సివిల్స్ రాస్తే 161వ ర్యాంకు వచ్చింది. అయినా జాబ్ వదిలి కోచింగ్ సెంటర్ ఓపెన్ చేశా. ఎంతోమందిని ఐఏఎస్లుగా తయారు చేస్తున్నాను. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చే నిపుణ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. అందరూ తప్పక చదవాలి. ఈ దినపత్రిక పుణ్యమా అని తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు హాజరై అభ్యర్థులను ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది.
– మల్లవరపు బాలలత, సీఎస్బీ అకాడమీ డైరెక్టర్
రివిజన్ చాలా ముఖ్యం..
వార్షిక పరీక్షలకు చదివినట్లు చదివితే లాభం లేదు. కాంపిటీటివ్ పరీక్షల్లో ఉన్న పోటీకి అనుగుణంగా అభ్యర్థులు ప్రణాళికా ప్రకారం చదవాలి. అలా ప్రిపేర్ అయితే ఒక్కటి కాదు.. అనేక ఉద్యోగాలు అవలీలగా సాధించొచ్చు. వార్షిక పరీక్షలకు తక్కువ సమయం చదివినా మార్కులు పడతాయి. పేపర్ కరెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో అలాకాదు. అ ర మార్కు కూడా మీ జీవితాన్ని మారుస్తుంది. చదువుకోవాలంటే నిద్ర వస్తుందని చాలా మంది అంటుంటారు. అలాంటప్పుడు నిద్ర కోసం ముందే ప్లాన్ చేసుకోవాలి. నిద్ర లేవగా నే చదివితే ఎనర్జిటిక్గా ఉంటాం. చదివే సమయంలో మొబై ల్ దూరం పెట్టాలి. చీటికి మాటికి ఫోన్లు మాట్లాడడం వల్ల చ దువు పక్కదారి పడుతుంది. ఏ రోజుకారోజు ఏం చేశారో స క్సెస్ డైరీ రాసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు ఏం చేయాలనేది ముందే ప్లాన్ చేయాలి. ఫలానా టైంకు ఇది చదవాలి అ ని ముందే అనుకుంటే మన మెదడు అందుకు అనుగుణంగా సహకరిస్తుంది. సినిమాలను ఏ విధంగా గుర్తు పెట్టుకుంటా మో.. అదే తరహాలో చదువును విజువలైజ్ చేసుకోవాలి. అ లా చేస్తే ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది. కాంపిటీటివ్ పరీక్షల్లో ఎంత సమయంలో ఆన్సర్ చేయాలనేదాన్ని ముందే నిర్ణయించుకోవడం వల్ల ఫాస్ట్గా మన మెదడు సంకేతాలు ఇస్తుంది. ఆ నాలెడ్జ్ను మార్కుల కింద మార్చుకోవాలి. చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో.. వాటిని రివిజన్ చేయడం కూడా అంతే ముఖ్యం. రివిజన్ చేయడం వల్ల అనేక అంశాలు గుర్తుకువస్తాయి. పరీక్ష రాసే సమయంలో టెన్షన్ పడొద్దు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయం.
– డాక్టర్ సీఎస్ వేపా, వేపా అకాడమీ డైరెక్టర్
పట్టుదల ఉంటే గెలుపు మనదే..
వచ్చిన అవకాశాన్ని పట్టుదలతో ఒడిసిపట్టుకుంటే విజయం మనదే. తెలివితేటలే మనకు గొప్ప ఆస్తి. 17 ఏండ్ల వరకు చదువం టే తెలియని అబ్రహం లింకన్ అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక డ్రస్తో స్కూల్కు వెళ్లిన డా.అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. మనం కూడా పట్టుదలతో ముందుకెళ్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఫ్రీ కోచింగ్లకు శ్రీకారం చుట్టిన కలెక్టర్, ఎస్పీలకు అభినందనలు. ప్రతిభ ఉ న్న విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కోచింగ్ సెం టర్లకు దీటుగా మెటీరియల్ తయారు చేయించి ఉచితంగా కోచింగ్ ఇప్పించాం. అవకాశాలు లేక కష్టపడి పైకి రావాలనుకునే వారికి ప్రభుత్వం, అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. మనం తలుచుకుంటే ఎన్నో సృష్టించొచ్చు. సమాజంలో మార్పు చేసినోళ్లే గొప్పోళ్లు అవుతారు. కష్టపడి చదివితే అన్నీ సాధ్యమే. ఆడవారిని చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతున్నది. ప్రోత్సహిస్తే ఆడవారు మంచి శక్తిగా ఎదుగుతారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.
అనవసర పోస్టులను సోషల్మీడియాలో షేర్ చేయొద్దు. సమైక్య రాష్ట్రంలో అందరం కలిసి ఉంటే బాగుపడతామనుకున్నాం. కానీ ఇంత వివక్ష చూపుతారనుకోలేదు. ఉద్యోగం చేస్తునే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. మా అమ్మానాన్న కోరిక మేరకు ఉద్యోగం మానేశా. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మీ అందరికీ సేవ చేస్తున్నాను. ప్రజాసేవ చేయాలనే తపన ముందుకు నడిపించింది. మంచి ఉద్యోగం ఉంది కదా అని.. ఉద్యమం వైపు వెళ్లకుంటే ఇంతమందికి సేవ చేసే అవకాశం దక్కేది కాదు. మా అమ్మానాన్నల పేరుమీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు అండగా ఉంటున్నాను. నాకు ఇందులోనే తృప్తి ఉన్నది.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
నాన్న బాటలో నడుస్తున్నా..
మా నాన్న, మంత్రి శ్రీనివాస్గౌడ్ బాటలో నడుస్తూ పేదలకు సేవ చేయడం ఎంతో ఆ నందంగా ఉంది. కరోనా సమయంలో ఎంతో మందికి భోజ నం అందించాం. ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఉచితంగా భోజనం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ ఇప్పించాం. మెటీరియల్ను కూడా అందించాం. కోచింగ్కు వచ్చిన వారికి ఉచిత భోజన వసతి కల్పించాం. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ద్వారా అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయం. మేధావులతో వారికి అవగాహన కల్పించారు.
– వి.శ్రీహిత, శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ చైర్పర్సన్
సందేహాలను నివృత్తి చేశారు..
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది. మంచి ఫ్యాకల్టీతో గ్రూప్స్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చారు. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సందేహాలను నివృత్తి చేసుకున్నా. బాలలత మేడంను ఎలా ప్రిపేర్ కావాలని అడిగాను. ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలన్నారు. ఉద్యోగం సాధించేందుకు రోజుకు 12 గంటలు చదవాలని సూచించారు. ఈ సదస్సుతో మేలు జరుగుతుందని భావిస్తున్నా. వారి సూచనలు పాటించి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతా.
– విజయ్లక్ష్మి, రామయ్యబౌళి, మహబూబ్నగర్
సూచనలు నోట్ చేసుకున్నా..
ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోసం ఎలా కష్టపడాలన్న విషయాలపై పలువురు వక్తలు చాలా బాగా వివరించారు. వారు చెప్పిన సూచనలన్నీ నోట్ చేసుకున్నాను. ఏ సబ్జెక్టు నుంచి మొదలుపెట్టాలి? ఏ విధంగా చదవాలి..? తెలియక అ యోమయంలో ఉన్న వారికి బాలలత మేడం వివరించారు. ఆమె క్లాస్ వినేందుకు అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు.
– అలివేలు, మహబూబ్నగర్
ఎలా చదవాలో తెలిసింది..
గ్రూప్-1, 2 పరీక్షలు రాసే వారు బట్టీపట్టి చదవడం మానుకోవాలన్న విషయం తెలుసుకున్నా. బట్టీ పడితే నేర్చుకున్నవి మర్చిపోయి ఉద్యోగం చేజారే ప్రమాదం ఉంటుంది. ప్రణాళికా ప్రకారం చదవాలన్న అంశాలను ఇక్కడే నేర్చుకున్నా. 33 జిల్లాల చరిత్రపై పట్టు సాధించాలని, కనీసం రోజుకు 50 పాత ప్రశ్నాపత్రాలను చదవాలని వక్తలు సూచించారు. ‘నమస్తే తెలంగాణ’లో నిత్యం వస్తున్న నాలుగు పేజీల నిపుణ స్టడీ మెటీరియల్ చదివితే ఉద్యోగం సాధించొచ్చన్న విషయం అర్థమైంది. మా కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ‘నమస్తే తెలంగాణ’, మంత్రి శ్రీనివాస్గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– రావుఫ్బాషా, మహబూబ్నగర్
సంతోషంగా ఉన్నది..
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్నాను. శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇచ్చిన కోచింగ్ తీసుకున్నాను. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై ప్రముఖులచే అవగాహన కల్పించడం సంతోషంగా ఉన్నది. ఉద్యోగాలకు ఎలా సిద్ధం కావాలి..? ఎలా చదివితే కొలువు సాధించొచ్చు..? అనే విషయాలపై అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిని తప్పకుండా పాటిస్తా. కొలువు సాధించి తల్లిదండ్రులకు అండగా ఉంటా.
– ఆంజనేయులు, బోయపల్లి, మహబూబ్నగర్
కొత్త విషయాలు నేర్చుకున్నా..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నాను. పోటీ పరీక్షలపై ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో పలువురు వక్తలు అవగాహన కల్పిస్తారని తెలిసి వచ్చాను. హైదరాబాద్కు చెందిన ప్రముఖులు చాలా మంచి విషయాలు చెప్పారు. కొత్త అంశాలు నేర్చుకున్నాను. ప్రణాళిక, అవగాహన ప్రకారం ముందుకెళ్తే విజయం సాధించొచ్చన్న నమ్మకం ఏర్పడింది.
– జ్యోతి, మద్దూర్,నారాయణపేట జిల్లా
ప్రణాళిక ప్రకారం ముందుకు..
ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసే కంటే ముందే మంత్రి శ్రీనివాస్గౌడ్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాం. ఆయా నోటిఫికేషన్లకు అనుగుణంగా మెటీరియల్ తయారు చేయించి ఎక్స్పో ప్లాజాలో వంద రోజులపాటు అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించాం. కోచింగ్కు వచ్చిన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి కల్పించాం. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో బోధన ఇప్పించాం. చాలా మంది ప్రైవేట్ కోచింగ్కు వెళ్లకుండా ఇక్కడే ప్రిపేరయ్యారు. ఇదంతా జిల్లా అధికారులు, మంత్రి కృషి వల్లే సాధ్యమైంది.
– వెంకట్రావు, మహబూబ్నగర్ కలెక్టర్