మహబూబ్నగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఐసీసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కు పనులు తుది దశకు చేరుకున్నాయి. పాలమూరు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐటీ ఇండస్ట్రియల్ పార్కును మంజూరు చేసింది. ఇటీవల కరీంనగర్లో మంత్రి కేటీఆర్ ఐటీ పార్కును ప్రారంభించడంతో పాలమూరు జిల్లాలో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.25 కోట్లతో చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు టవర్ల నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఐటీ పార్కు ప్రారంభమైతే దాదాపు 30 కంపెనీలు స్థాపించేందుకు మంత్రి కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఐటీపార్కు ఏర్పాటుకు మొదట 481 ఎకరాలు సేకరించాలని అనుకున్నా.. చివరకు రెవెన్యూ అధికారులు నిర్వహించిన డీజీపీఎస్ సర్వేలో 371.34 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు తేలింది. దీంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ రైతులను ఒప్పించి భూ సేకరణ పూర్తి చేయించారు. 2018 జూలై 7న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ పార్కులో 100 ఎకరాలను ఎనర్జీ పార్కు కోసం కేటాయించాలని గతేడాది మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరడంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా లిథియం సెల్స్ తయారీ కేంద్రానికి పాలమూరు ఐటీ పార్కు వేదిక కాబోతున్నది. మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పచ్చజెండా ఊపారు. ఈ ఐటీ పార్కు సమీపంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, జాతీయ రహదారి ఉండడంతో కంపెనీలు క్యూ కడతాయని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అంచనా. ఇటీవల మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన జాబ్మేళాలో 2,015 మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చారు. ఈ ఐటీ పార్కు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
తొలి లిథియం సెల్ తయారీ కేంద్రం..
పెట్రోల్, డీజిల్ కొరతను అధిగమించేందుకు ఎలక్ట్రానిక్, బ్యాటరీతో నడిచే కార్లలో ఉపయోగించే లిథియం ఆయాన్ బ్యాటరీ ప్యాక్ల తయారీలను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. రూ.2 వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు గ్రీన్కో కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడులన్నీ మహబూబ్నగర్ ఐటీ పార్కుకు మళ్లించారు. దీంతో దేశంలోనే తొలిసారిగా లిథియం ఆయాన్ సెల్ తయారీ కేంద్రం దివిటిపల్లిలోని ఐటీ పార్కులో ఏర్పాటు కానున్నది. అలాగే ఫొటో ఓల్టాయిక్ సెల్స్, బ్యాటరీ తయారు చేసే గిగా ఫ్యాకర్టీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. 18 కంపెనీలు ఐటీ పార్కులో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఐటీ పార్కు ప్రారంభమైతే వేల మందికి ఉపాధి లభించనున్నది.
క్యూ కడుతున్న కంపెనీలు..
మహబూబ్నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్కు రాష్ట్రంలోనే పెద్ద ఐటీ హబ్గా మారనున్నది. సాఫ్ట్వేర్, ఎనర్జీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పో ర్టు సమీపంలో ఉండడంతో చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. జా తీయ రహదారిని ఆనుకొని ఉండడంతో రవాణాకు కూడా ఇబ్బందులు తొలగనున్నాయి. ఐటీ పార్కు చుట్టుపక్కన మెడికల్ కాలేజీ, కేసీఆర్ ఎకో అర్బన్ పా ర్కు, కొత్తగా విమానాశ్రయం కూడా రాబోతుండడంతో భూ ముల ధరలకు రెక్కలు వచ్చాయి. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే ఇక సాగు, తాగునీటికి కూడా ఢోకా ఉండదు.
– డా.వి.శ్రీనివాస్గౌడ్, ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి