మహబూబ్నగర్ టౌన్, జూలై 4 : మహబూబ్నగర్ రూరల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం పథకాన్ని తక్షణమే అమలుచేయాలని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. బోయపల్లి జెడ్పీహెచ్ఎస్, ధర్మాపూర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించిన విషయంపై మంత్రి స్పందించారు. సోమవారం కలెక్టరేట్లో మధ్యాహ్న భోజన పథకంపై కలెక్టర్ ఎస్.వెంకట్రావు, డీఈవో రవీందర్తో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుడ్లు పెట్టాలన్నారు. ముందుగా మహబూబ్నగర్ రూరల్ మండలంలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని, అనంతరం హన్వాడ మండలంలో ప్రవేశపెట్టాలన్నారు. అంచెలంచెలుగా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో ఈ పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.., బోయపల్లి, ధర్మాపూర్ వంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. సమస్య మళ్లీ ఉత్పనమైతే కఠిన చర్యలు తీసుకుంటామని, బోయపల్లి, ధర్మాపూర్ హెచ్ఎంలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.