మక్తల్ టౌన్, జూన్ 30: మక్తల్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధించినట్లు మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ పావని అన్నారు. గురువారం మక్తల్ మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పావని ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించడంపై మున్సిపాలిటిలోని కిరాణ అసోసియేషన్ వివిధ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ 120 మైక్రాన్లకంటే తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని అందుకుగానూ మక్తల్ పురప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని తెలిపారు.
ప్లాస్టిక్ సంచుల బదులు ప్రజలే స్వచ్ఛందంగా చేతిసంచులు తెచ్చుకోవాలని తెలిపారు. ప్లాస్టిక్ వలన ప్రకృతితో కూడిన నేల కలుషితమవుతుందని, ప్లాస్టిక్ నేలలో కలిసి పోవడానికి చాలా ఏండ్లు పడుతుందని, నేల కలుషితం కావడానికి కారణంకూడా ప్లాస్టిక్ అని తెలిపారు. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు డ్రైనేజీలో పడి మురుగు నీరు పారకుండా అడ్డుపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వాడిన ప్రజలకు రూ.500 వ్యాపారస్తులకు రూ.5000నుంచి 20వేల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ నర్సింహ, వైస్ చైర్పర్సన్ అఖిల, వ్యాపారస్తులు పాల్గొన్నారు.