జడ్చర్లటౌన్, జూన్ 27 : కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న హైదరాబాద్ డిపో-1కు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఇంజిన్లో షార్ట్సర్క్యూట్తో పొగలు,మంటలు వ్యాపించి ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన ఆదివారం అర్ధరాత్రి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం ప్రకారం..హైదరాబాద్ డిపో-1కు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 11గంటల సమయంలో కర్నూల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటల సమయంలో జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి సమీపంలోకి ఆర్టీసీ బస్సు చేరుకోగా, అకస్మాత్తుగా బస్సు ఇంజిన్లో నుంచి పొగలు వ్యాపించి మంటలు చెలరేగాయి. వెంటనే బస్సు డ్రైవర్ సురేశ్కుమార్ అప్రమత్తమై మొదటగా బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులను కిందికి దింపివేసి, వెంటనే 100కు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. బస్సులోని 16 మంది ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ప్రమాదంలో కాలిబూడిదైన బస్సును మరో బస్సు సాయంతో డిపోకు తరలించారు. బస్సు ప్రమాద ఘటన సమయంలో ప్రయాణికులంతా గాడనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా బస్సులో పొగలు కమ్ముకోవటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా మంటల చెలరేగటంతో ఆందోళనకు గురైనట్లు తెలిపారు. కానీ డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీధర్, జడ్చర్ల సీఐ రమేశ్బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.