మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 25: ప్రణాళికా బద్ధంగా కష్టపడి చదివితే గ్రూప్స్ సాధించటం సులభమేనని విశ్రాంత ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో గ్రూప్స్ అభ్యర్థులనుద్దేశించి ఏర్పాటు చేసిన ప్రేరణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్తో పాటు, పోలీసు, ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర ప్రారంభమైన నేపథ్యంలో యువత ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలన్న తపనతో చదవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసిందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న సుమారు 600మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ప్రేరణ కల్పించారు. కష్టపడితే పోయేదేమి లేదని స్ఫూర్తి కలిగించారు. అభ్యర్థులు ఇష్టంతో చదవాలని, రీడింగ్, రికార్డు, రివిజన్ పద్ధతి అనుసరించాలని, 360 డిగ్రీల కోణంలో ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. గ్రూప్స్కు కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక జరగనున్నదని, ఇంటర్వ్యూ సిఫార్సులకు పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు మాట్లాడారు. అదనపు ఎస్పీ రాములు, డీఈవో ఉషారాణి, మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి, సోషల్ వెల్ఫేర్, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు యాదయ్య, ఇందిర, చత్రూనాయక్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు సదస్సుకు హాజరయ్యారు. అంతకముందు ఆర్అండ్బీ అతిథి గృహంలో కమిషనర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను శాలువాతో సత్కరించారు.