మహబూబ్నగర్, జూన్ 23 : హైదరాబాద్కు దీటుగా మహబూబ్నగర్ అభివృద్ధి చెందుతున్నదని, అందరూ కలిసికట్టుగా మరింత అభివృద్ధి చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ పరిధిలోని వడ్డెర బస్తీలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ సంఘం భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న 200 మంది కార్మికులు టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరారు. వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి పాలనలో వారికి భవనం ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఈ విషయాన్ని తెలియజేయగా.. స్పందించి రూ.5 లక్షలు మంజూరు చేశారని కార్మికులు తెలిపారు. ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మంత్రిని గజమాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు.
ఆటో యూనియన్ నుంచి..
జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో యూనియన్లో బీజేపీ, కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న 500 మంది నాయకులు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆటోలకు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. మహబూబ్నగర్కు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, ఐటీ, ఫుడ్ పార్కుల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ముఖ్య ప్రదేశాల్లో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేసి కార్మికులు దర్జాగా జీవించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, కౌన్సిలర్లు నీరజ, కట్టా రవికిషన్రెడ్డి, పాషా, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ పాల్గొన్నారు.
త్వరలో అర్హులందరికీ పింఛన్లు
అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ రంగ సంస్థల ఈపీఎస్ పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, సంఘం జాతీయ అధ్యక్షుడు అశోక్రావత్తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న పెన్షనర్ల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ జరుగనున్న పార్లమెంట్ సమావేశంలో పెన్షనర్ల సమస్యలను ప్రశ్నిస్తానన్నారు. వారికి కేంద్రం పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. సమావేశంలో సంఘం నేతలు అబ్దుల్కరీం, రమాకాంత్ నర్గుడి, కరువడి, రాంరెడ్డి, ప్రభాకర్, బస్వరాజ్, చక్రపాణి, రాజసింహుడు, కొండన్న, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్, క్రీడలు, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పద్మావతి కాలనీ పెట్రోల్ బంక్ సమీపంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్ల వెంట పచ్చదనం పెంచి ఆహ్లాదంగా మారుస్తామని తెలిపారు.