మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 21 : డాక్టర్లు దైవానికి ప్రతిరూపాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం స్నాతకోత్సవం నిర్వహించారు. 150 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటగా ఏర్పాటైన మహబూబ్నగర్ మెడికల్ కళాశాల నుంచి 150 మంది వైద్యులు ఒకేసారి తెలంగాణ గడ్డపై కాలు పెడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.
ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ పట్టా పొందడం గొప్పకాదని, ఎంత గొప్ప సేవలందించామన్నదే ముఖ్యమన్నారు. డాక్టర్ల సేవలను సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు. డాక్టర్కు ఉన్న గౌరవం ప్రపంచంలో ఎవరికీ లేదని తెలిపారు. పేదవారికి ఉచిత వైద్యం చేయాలని సూచించారు. మహబూబ్నగర్ వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రభుత్వ దవాఖానను వైద్య కళాశాలకు అనుసంధానం చేశామన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానలో పూర్తి స్థాయి డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు.
కరోనా సమయంలో కూడా మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గొప్ప సేవలు అందించారని కొనియాడారు. మహబూబ్నగర్ పాత కలెక్టరేట్ స్థానంలో త్వరలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు చెప్పారు. మహబూబ్నగర్ను నెంబర్వన్ జిల్లాగా చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, వైద్య కళాశాల డైరెక్టర్ నవకల్యాణి, కళాశాల మాజీ సంచాలకుడు పుట్టా శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ రాంకిషన్, తెలంగాణ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సంపత్రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంమోహన్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు, అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు విజయ్ వెలదండి, ఏఎస్పీ రాములు, డాక్టర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.