నాగర్కర్నూల్, జూన్ 16 : బిజినేపల్లి మండలంలోని 17 తండాలు, ఐదు గ్రామాల పొలాలకు సాగునీరందించేందుకు చేపట్టిన మార్కండేయ ఎత్తిపోతల పనులకు ఈ నెల 18న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నాగర్కర్నూల్కు వచ్చినప్పుడు బిజినేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, తండాలకు సాగునీరందండంలేదనే విషయాన్ని చెప్పానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.60 కోట్లతో మార్కండేయ ఎత్తిపోతలను మంజూరు చేశారని, కొవిడ్ తదితర కారణాలతో పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగిందన్నారు.
ఈ పథకం పనులు పూర్తయితే 7,320 ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఈ పనులకు సంబంధించి శాయిన్పల్లి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన పైలాన్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరిస్తారని చెప్పారు. అంతేకాకుండా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మరో రూ.302.40 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వివరించారు. బిజినేపల్లిలో నిర్మించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. సాయంత్రం బిజినేపల్లి మండలకేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.