నాగరికత ఎంత ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. దుక్కి దున్నందే తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పుట్టదు. అన్నదాతలు మొదట దుక్కి దున్నడాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. ఓషదులకు, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ట నక్షత్రానికి చేరువలో ఉన్న సమయంలో ఏరువాక పౌర్ణమి శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ట పౌర్ణమిన మొదటిసారి రైతులు పొలాన్ని దున్నుతారు. మంగళవారం ఏరువాకను ఘనంగా జరుపుకొనేందుకు రైతులు, ప్రజలు సిద్ధమయ్యారు.
గద్వాలటౌన్, జూన్ 13 : నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పుట్టదు.. జాతికి వెన్నెముకగా నిలిచిన రైతన్న జరుపుకొనే పండుగే ఏరువాక పౌర్ణమి.. ఏరువాక పండుగను మంగళవారం ఘనంగా జరుపుకొనేందుకు నడిగడ్డ రైతులు, ప్రజలు సిద్ధమయ్యారు. వ్యవసాయదారులు ఏరువాక పండుగను జ్యేష్ట పౌర్ణమి నాడు జరుపుకొంటారు. తెలుగు సంవత్సరంలో జేష్ట మాసం మూడవనెల కాగా, మొదటిపక్షంలో రోహిణి కార్తె తర్వాత మృగశిర కార్తె వస్తుంది.
ఈ కార్తెలో ఎండల ప్రభావం తగ్గి ముంగిళ్లు చల్లబడతాయన్న నానుడి ఉంది. అంతేకాదు జ్యేష్ట పౌర్ణ మి నాటికి తొలకరి పలుకరించకమానదు. ఇందు కు కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకొనే పండుగను కృషి పూర్ణిమ, మాల పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ అంటారు. ఏరువాక అంటే నాగలితో దుక్కి ప్రారంభమవుతుందన్న అర్థం ఉంది. ఆరుగాలం రైతులకు అన్నివిధాలా అండగా ఉండి పంట పొలాల్లో తమతోపాటు శ్రమించే పశువులను ఏరువాక నాడు పూజిస్తే కాలం కలిసొస్తుందని నమ్మకం. అందుకే రైతులు ఏరువాకను సంప్రదాయ పండుగగా జరుపుకొంటారు.
జ్యేష్ట పూర్ణిమ విశిష్టత..
నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ట అని జ్యోతిష్యశాస్త్రం చెబుతున్నది. ఈ నక్షత్రం చంద్రుడు కూడి ఉండే రోజు కావడం ఎంతో విశేషం. చంద్రుడు ఓషదులకు అధిపతి. ఓషదులు అనగ మంచు, ఎరువు, సూ క్ష్మధాతువులు అని అర్థం. ఇవన్ని ఉంటేనే వ్యవసాయం ఫలసాయాన్ని ఇస్తుందన్న నమ్మకం రైతుల్లో ఉంది. అందుకే జ్యేష్ట పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.
పండుగ జరుపుకొనే విధానం..
ఆరుగాలం కష్టించే రైతన్నకు తోడుగా వారి కష్టా ల్లో భాగం పంచుకుంటూ అన్నివిధాలా అండగా ఉండే పశువులను ఏరువాక పౌర్ణమి నాడు ఉదయానే చెరువులు, కుంటల వద్దకు తీసుకెళ్లి స్నానా లు చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తా రు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు, కుచ్చులు కట్టి శరీరం నిండా రంగులు అద్దుతారు. ఆర్థికస్థోమత ఉన్న రైతులకు ఎద్దులను నూతన వస్ర్తాలతో అలంకరించి ఇంట్లో ఉన్న గాటి వద్దకు తీసుకొస్తారు. పండుగ సందర్భంగా చేసిన పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ గాటికి దూప, దీపాలతో పూజలు చేసి చల్లంగా చూడమని వేడుకుంటారు. సాయంత్రం మంగళవాయిద్యాలతో ఊళ్లో ఉన్న పశువులన్నింటినీ ఒక దగ్గరకు చేరుస్తారు. అక్కడి నుంచి పశువుల ఊరేగింపు ప్రజల కేరింతల మధ్య కనులపండుగగా సాగుతుంది. ఎద్దులతోపాటు నాగలిని ఎర్రమట్టి, సున్నంపట్టెలతో అలంకరించి పొలం వద్దకు వెళ్తారు. ఈ ఏడాది రైతు కుటుంబంలో ఎవరి పేరుపైన బలం ఉందో వారు దుక్కిని దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు.
ఏరువాక తాడు తెంచడం..
దుక్కి దున్నడానికి వెళ్లే ముందు ఊరి పొలిమేరలో పుంటినారతో తోరణాన్ని కడతారు. తోరణానికి రూపాయలు, జిలేబీలు, గారెలు, గజ్జెలు తదితర వస్తువులను రైతులు అలంకరిస్తారు. వాటిని చెరకోలతో కొడుతూ ఎవరికి దొరికిన వస్తువును వారు తీసుకెళ్తుంటారు. ఈ విధంగా చేయడంవల్ల పశువులకు మేలు కలుగుతుందని రైతుల నమ్మ కం. దీనినే ఏరువాక తాడు తెంచడం అని అంటా రు. ఈ ఆచారాన్ని, పండుగను విష్ణు పురాణంలో సీత యజ్ఞంగా పిలువబడేదని ప్రతీతి.
కనీసం ఒక మొక్కనైనా నాటాలి..
ఏరువాక పండుగ నాడు రైతులు సాగుకు శ్రీకారం చుడుతారు. విత్తులు విత్తుతారు.సాగు భూములు లేని వారు కూడా ఏరువాకను ఘనం గా జరుపుకోవచ్చు. ప్రకృతి సంస్కరణకు ప్రతిఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటాలి. ఇలా నాటడం ఎంతో శుభప్రదమని శాస్ర్తాలు చెబుతున్నాయి.
పండుగకు సర్వం సన్నద్ధం..
ఏరువాక పండుగను ఘనంగా జరుపుకొనేందుకు నడిగడ్డ రైతులు, ప్రజలు సన్నద్ధమయ్యారు. పం డుగ సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రం గ్రామీన ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఉత్సవాలకు సంబంధించిన వాటిని కొనుగోలు చేయడంలో రైతులు నిమగ్నమై కనిపించారు. గ్రామదేవతలకు సమర్పించేందుకు కోళ్ల కొనుగోలు కూడా జోరుగా సాగింది. అలాగే గ్రామదేవతలైన సుంకులమ్మ, ఈదమ్మ అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేశారు. స్థానిక చింతలపేటలో ఏరువాక తాడు తెంచే ఉత్సవాన్ని నిర్వహించేందుకు, ఎడ్ల ఊరేగింపునకు కావాల్సిన ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు.