Varalaxmi sarathkumar | టాలీవుడ్లో తాజాగా వరలక్ష్మి శరత్కుమార్, దర్శకుడు సంజీవ్ మేగోటి మధ్య నెలకొన్న వివాదం హాట్ టాపిక్గా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న పోలీస్ కంప్లైంట్ సినిమా చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా, వాటికి స్పందనగా వరలక్ష్మి చేసిన సోషల్ మీడియా పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొరిగే కుక్కలు కరవవు… కరిచే కుక్కలు మొరగవు… నేను మొరగను… కరుస్తాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.
ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనే విషయంపై అధికారిక స్పష్టత లేకపోయినా, ‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే ఈ స్పందన వచ్చిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూన్ 12న విడుదల కానున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. హారర్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాపై చిత్రబృందం మంచి అంచనాలు పెట్టుకుంది. అయితే విడుదలకు ముందు నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు సంజీవ్ మేగోటి కొన్ని అసంతృప్తికర విషయాలను బహిరంగంగా వెల్లడించారు.సినిమా సెకండాఫ్ డబ్బింగ్ పూర్తి చేయడానికి వరలక్ష్మి మూడు నెలల సమయం తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె ఇతర ప్రాజెక్టులు కూడా చేశారు. ఒప్పందంలోని కొన్ని అంశాలు పాటించలేదు. ప్రమోషన్లకు రావాలని పలుమార్లు కోరినా స్పందించలేదు అని ఆయన ఆరోపించారు.
అలాగే హీరో నవీన్ చంద్ర కూడా ప్రమోషనల్ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. దర్శకుడి వ్యాఖ్యలు బయటకు వచ్చిన కొద్దిసేపటికే వరలక్ష్మి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. సినిమా విడుదలకు ముందు ప్రధాన నటీనటులు, దర్శకుడి మధ్య ఇలాంటి విభేదాలు బయటపడటం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.అయితే ఈ ఆరోపణలపై వరలక్ష్మి శరత్కుమార్ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. ఆమె పోస్ట్ను మాత్రమే అభిమానులు, నెటిజన్లు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. సినిమా వ్యాపారపరంగా చూసుకుంటే వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర ఇద్దరూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కలిగిన నటులు. ముఖ్యంగా వారి ఫేస్ వాల్యూ, నటనపైనే సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ కూడా ఆధారపడింది.ఇలాంటి సమయంలో ప్రధాన నటీనటులు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటం సినిమా ఓపెనింగ్స్పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
45 రోజుల వ్యవధిలో, 50 మందికిపైగా నటీనటులతో తెరకెక్కించిన ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు ముందే వివాదాల కేంద్రంగా మారింది. సినిమా విడుదల తర్వాత ఈ వివాదం మరింత ముదురుతుందా? లేక విజయంతో అన్ని చర్చలకు ముగింపు పలుకుతుందా? అనేది చూడాలి.