గద్వాల, మే 23: సంఘటిత, అసంఘటిత రంగాల్లో 10మంది కంటే ఎక్కువ మహిళలు పని చేసేచోట లైంగిక వేధింపులకు అవకాశం ఉంటుందని, వాటిని నిరోధించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని మహిళా శిశుసంక్షేశాఖ అధికారి ముషాయిదాబేగం కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళపై లైంగిక వైధింపుల ఫిర్యాదు కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కార్యాలయంలో ప్రతి అధికారి రాత పూర్వ ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు నిరోదించడానికి, వారికి అనుకూలమైన పని ప్రదేశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2013లో లైంగిక వేధింపుల నిరోదక చట్టం తీసుకొచ్చిదని తెలిపారు.
అంతర్గత కమిటీలో నలుగురు సభ్యులు ఉండాలని సూచించారు. కమిటీలో లీగల్ పరిజ్ఞానం కలిగిన సీనియర్ మహిళా ఉద్యోగి చైర్మన్గా ఉండాలని తెలిపారు. సామాజిక పరిజ్ఞానం కలిగినవారు, స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన వారు సభ్యులుగా ఉండాలని పేర్కొన్నారు. పనిచేసే చోట సిబ్బందికి చట్టంపై అవగాహన కల్పించే డిస్లే బోర్డులు ఏర్పాటు చేయాలని లీగల్ కౌన్సిలర్ రమాదేవి సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.