పెబ్బేరు రూరల్, మే 20 : గ్రామీణ మట్టి పరిమళాలు అంతర్జాతీయ స్థాయిలో మెరవనున్నారు. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ఉమాశంకర్, అశోక్ అనే యువకులు టార్గెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 13నుం చి 17వరకు జరుగనున్న అంతర్జాతీయ టార్గెట్బాల్ పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ టార్గెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రేవంత్కుమార్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నర్సింహ, కోచ్ కమలాకర్ శుక్రవారం చెప్పారు. గత ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్లోని మధురలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో వీరిద్దరిని ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఉమాశంకర్, అశోక్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన తమకు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. దాతలు సహకరిస్తే గ్రామానికే కాదు రాష్ర్టానికే పేరుప్రతిష్టలు తెస్తామని వారు పేర్కొన్నారు.