వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల స్వరూపం మారనున్నది. దశాబ్ధాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో తిష్ఠవేసిన సమస్యలు తీరి వచ్చే విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్య అందించనున్నది. అందుకోసం అధికారులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. 12అంశాల ప్రతిపాదికన చేపట్టే చర్యలు ప్రభుత్వ పాఠశాలలు వైభవం సంతరించుకునేలా చేయనున్నది. దీనికోసం కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఆధ్వర్యంలో విద్యాశాఖతోపాటు ఇతర శాఖలు సమన్వయం చేసుకుంటూ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. విడుతల వారీగా చేపట్టే ఈ పనుల్లో ముందుగా ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీకాలనీలకు సమీపంలోని పాఠశాలల మరమ్మతులు, నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లాలోని 14మండలాల పరిధిలో ఇప్పటికే అంచనాకు వచ్చిన అధికారులు పనులను వేగవంతం చేశారు. సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా నుంచి మనఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో మంత్రి నిరంజన్రెడ్డితోపాటు జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చేపడుతున్నారు.
ప్రత్యేక బృందాల పర్యటన
విద్యార్థులకు వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా మనఊరు-మనబడి, మనఊరు-మనబస్తీ పనులన్నీ పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించారు. నిర్ణీత సమయం, నిధుల కేటాయింపు తదితర అంశాలను ఉత్వర్వుల్లో పేర్కొనక పోయినప్పటికీ త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఎంఈవోలు, ఇంజినీర్ల ఆధ్వర్యంలో పాఠశాల అవసరాల మేరకు ప్రత్యేక బృందాలు అంచనా వేస్తున్నాయి. నిధులపై ఎలాంటి నియంత్రణ లేకుండా అవసరమున్న ప్రతి పనిని పూర్తిచేయాలని నిశ్చయించారు. పూర్తిస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమాలన్నీ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు, విద్యాధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు దాతల సహాయంతో చేపట్టనున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిసి 518ఉండగా ఇందులో మొదటి విడుతలో 183 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటి మరమ్మతులు చేయడంతోపాటు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. అతి ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలు, కూలిపోయే దశలో ఉన్న పాఠశాలలకు తొలి విడుతలో ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతున్నారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన మాత్రమే కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో టీచింగ్ చేపట్టనున్నారు. దీనికోసం ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా 12అంశాలను పరిగణలోకి తీసుకుని మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. దాతల నుంచి కూడా నిధులు సమకూర్చుకుంటున్నారు.
అంచనా వేస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో పనులు, నిధుల కేటాయింపుపై అంచనా వేస్తున్నాం. ప్రత్యేక అధికారుల బృందం జిల్లాలోని పాఠశాలలను పరిశీలిస్తున్నది. పనులు పూర్తి చేయడానికి నిర్ణీత గడువు లేదు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్నదే లక్ష్యం. మౌలిక సౌకర్యాల కల్పన, అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నాం. పనులను త్వరగా ముందుగా పూర్తిచేస్తాం. డైనింగ్ హాల్స్, అదనపు గదుల నిర్మాణాలకు టెండర్లు ఖరారైన తర్వాత పనులు ప్రారంభమవుతాయి. మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసి రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తున్నాం.
– షేక్ యాస్మిన్బాషా, కలెక్టర్, వనపర్తి జిల్లా