వనపర్తి, మే 7 : పల్లె పాటల పూదోటలో గుడిసె శివలింగం మెరిశాడు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో పుట్టి నేడు జానపద గాత్రానికి జీవం పోస్తున్నాడు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగాడు. ఓ వైపుతెలంగాణ సాంస్కృతిక సారథి సమాచార శాఖ వనపర్తిలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తనపాటలతో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.తెలంగాణ యాసతో ఆటాపాటలతో ఆకట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 10 వేలకుపైగా ప్రదర్శనలు.. లెక్కకు మించి అవార్డులు, ప్రశంసాపత్రాలు ఆయన సొంతమయ్యాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే అవార్డును కైవసం చేసుకొని కళకు జీవం పోశాడు.
నేటి ఉరుకుల పరుగుల జీ వితంలో అంతరించిపోతున్న పల్లె జానపదా లు, చెక్క భజన, కోలాటం, గొల్లసుద్దులు వం టి కళలకు గుడిసె శివలింగం ప్రాణం పోస్తున్నారు. యువతలో దాగిఉన్న కళలను వెలికితీస్తూ కళాకారులుగా తీర్చిదిద్దుతున్నాడు. సభ ఏదైనా ఆశుకవిగా, వ్యాఖ్యాతగా మాండలికం (యాస)లో ఆటపాటలతో ఆకట్టుకుంటున్నాడు.
ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి చెందిన గుడిసె రాముడు, గుడిసె సత్యమ్మ దంపతుల కుమారుడు గుడిసె శివలింగం. నిరుపేద కు టుంబంలో జన్మించాడు. తల్లి వేసే బొడ్డెమ్మ, తండ్రి భజన పాటలకు ఆకర్షితుడై చిన్నతనం నుంచే పాటలపై ప్రేమ పెంచుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ టీవీషోల్లో, ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వెన్నెల కళా సమితి ద్వారా ఎంతో మంది యువతీయువకులను కళాకారులుగా తీర్చిదిద్దుతున్నాడు. అంబేద్కర్, భగత్సింగ్, గద్దర్, వందేమాతరం శ్రీనివాస్, గోరటివెంకన్న, సుద్దాల అశోక్తేజ, సుద్దాల భారతి, జంగిరెడ్డి వంటి వారి స్ఫూర్తితో ప్రజా నాట్యమండలిలో శిక్షణ పొంది జాతీయ స్థాయి వరకు ఎదిగాడు. చిన్నతనం నుంచే జానపదాలను పాడడమే కాకుం డా పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే పలు సాంస్కృత్రిక కార్యక్రమాల్లో మొదటి స్థానాలను కైవసం చేసుకున్నాడు. ఉత్తమ గాయకుడిగా మహాత్మాజ్యోతిరావు ఫూలే అవార్డును కైవసం చేసుకోవడంతోపాటు 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రసుత్తం తెలంగాణ సాంస్కృతిక సారధి సమాచార శాఖ వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
కళాకారులకు చేయూత..
పేద యువతీయువకుల్లో దాగి ఉన్న కళల ను బయటకు తీసేందుకు 1994లో వెన్నెల క ళా సమితి అనే సంస్థను శివలింగం ప్రారంభించాడు. దాదాపు 100కు పైగా కళాకారుల ను సమాజానికి పరిచయం చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లోని రుగ్మతలను రూపుమాపేందుకు తన కళా ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. మా టీవీలో నిర్వహించిన ‘రేలారేరేలారే’ కార్యక్రమానికి శిక్షకుడిగా ఎంపికయ్యాడు. పాన్గల్ మండలం బండపల్లి గ్రా మానికి చెందిన రోజారమణి, జొన్నలబొగుడ తండాకు చెందిన ఉమా, రజిత, రాయిన్పల్లికి చెందిన జగపతిబాబుతోపాటు పలువురితో టీవీ ఛానెళ్లలో ప్రదర్శనలు ఇప్పించాడు.
తండ్రి అడుగుజాడల్లో కూతుళ్లు..
శివలింగం అడుగుజాడల్లో కూతుళ్లు నడుస్తున్నా రు. ఆడపిల్లలకు ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థానాలకు ఎదగుతారని నిరూపిస్తున్నాడు. శివలింగం ము గ్గురు కూతుళ్లు సంగీత, సాహితి, శృతి నేటి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదటి కూతురు సంగీత చిన్ననాటి నుంచే ఆటపాటల్లో రాణిస్తూ అ నేక ప్రదర్శనలు ఇచ్చారు. 2020-21సంవత్సరానికిగానూ భారత ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే క ళా ఉత్సవంలో వనపర్తి జిల్లా టీఎస్ఎంఎస్ (కొత్తకో ట మోడల్ కళాశాల) తరఫున సంప్రదాయ జానప ద నృత్యంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ బహుమతితోపాటు జాతీయ స్థాయిలో టాప్ 10లో ఒకరిగా నిలిచింది.
రెండో కూతురు సాహితి సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ సైన్స్ మేళా, గణితంలో వ నపర్తి జిల్లా నుంచి మొదటి స్థానంలో నిలిచింది. 2020-21 ఇంటర్ ఫస్టియర్లో గణితం సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కళాకారుల నృత్యంలో మొదటి బహుమతి సాధించింది. మూడో కూతురు శృతి విభిన్న ప్రతిభాశాలి. పాటలు పాడడం, మిమిక్రీ, జానపదం, శాస్త్రీయ నృత్యం వంటి రంగా ల్లో బాలభవన్ తరఫున అనేక ప్రదర్శనలు ఇచ్చింది. రవీంద్ర భారతిలో 2022 సంవత్సరానికిగానూ అం తర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చింది. తెలంగాణ భాషా సాంస్కృత్రిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, దేవతాసుధాకర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నది.
మన యాస.. మధురఘట్టం
రాష్ట్రం ఏర్పడక ముందు మన యాస, భాషలు అనేక వెక్కిరింపులకు గురయ్యాయి. తెలంగాణ యాస నేడు యావత్తు తెలుగు సినీచరిత్రలో ఒక మధుర ఘట్టంగా మారింది. ఈ తరుణంలో అనేక మందికి గుర్తింపు వస్తున్నది. మూఢనమ్మకాలు, చేతబడులు, మద్యపానం, నిరక్షరాస్యత, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ వాడకం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చిన్నారులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో సులువుగా రాణిస్తారు. వారి మక్కువను పసిగట్టి ఆ రంగం వైపు ప్రోత్సహించాలి. నా కూతుళ్లు చాలా బాగా రాణిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
– గుడిసె శివలింగం, కళాకారుడు
కళా ప్రదర్శనలు..
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ, కాకతీయ, ఆస రా పింఛన్లు, పల్స్ పోలియో, ర్యాగింగ్, ఎయిడ్స్ నివారణ, కుటుంబ నియంత్రణ, చేతబడులు, పరిసరాల పరిశుభ్రత, 108, 104, 102 వినియోగం వంటి తదితర అంశాలపై కళా ప్రదర్శనలు ఇస్తున్నాడు. 1994 నుంచి నేటి వరకు సమాచార పౌర సంబంధాల శాఖ అనుసంధానంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. నెదర్లాండ్ వారి అనుబంధంతో బోర్వెల్స్, రైతు చైతన్య సదస్సులు, ఆరుతడి పంటల ఆవశ్యకత, సేంద్రియ ఎరువుల వాడకం, భూగర్భజలాల పరిరక్షణపై కర్నూల్, అనంతపూర్, కడప, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు ఇచ్చాడు.
అవార్డులు, ప్రశంసలు..