అమీర్పేట్, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ జర్నలిస్టుల సంక్షేమానికి క ట్టుబడి ఉందని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18వేల మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు లు కలిగి ఉన్నారన్నారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి కష్ట సమయాల్లో ముందుండి ఆదుకుంటోందని వివరించారు. కొవిడ్ కష్టకాలంలో మృతి చెందిన 64 మంది జర్నలిస్టుల కుటుంబాలను రూ.2లక్షల చొప్పున ఆర్థ్ధికసాయం అందించి ఆదుకున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన నిధి నుంచి ఇప్పటివరకు రూ.42 కోట్లను వెచ్చించామన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజులుగా జరుగుతున్న మహిళా జర్నలిస్టుల ముగింపు సదస్సుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సచివాలయ నూతన భవనంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా గదులు ఉండేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువస్తానని వెల్లడించారు. వర్క్ ప్లేస్లో వేధింపుల కట్టడికి అన్ని సంస్థల్లో మహిళల నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముగింపు సభలో ఎమ్మెల్సీ వాణీదేవి, కార్పొరేటర్ సంగీతయాదవ్, మహిళా జర్నలిస్టులు మాలిని సుబ్రహ్మణ్యం, ధన్య రాజేంద్రన్, సుమా బాల, శ్వేత, కవిత తదితరులు పాల్గొన్నారు.