లింగాల, ఏప్రిల్ 16 : తె లంగాణ అమర్నాథ్ యాత్ర గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం జాతర రెండో రోజు వైభవం గా కొనసాగింది. లింగమ య్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సుమారు లక్షకుపైగా వచ్చారని అధికారుల అంచనా.. దీంతో శివనామస్మరణతో నల్లమల పులకించింది. దట్టమైన అడవిని సై తం లెక్క చేయకుండా రాళ్లు, రప్పలు, గుట్టలు, లోయలు దాటుతూ వస్తున్నాం లింగమయ్యా.. అంటూ అలిసిపోకుండా కాలినడకన చేరుకున్నారు. మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ నలుమూలల నుంచి నల్లమల బాటపట్టారు. చిన్నా పెద్ద, పండు ముసలి అనే తేడా లేకుండా సాహసయాత్రలో ఉత్సాహంగా ముందుకు కదిలారు. శనివారం చైత్రశుద్ధ పౌర్ణమి రోజున లింగమయ్యను దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని ప్రజల్లో అపార నమ్మకం. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గుండంలో, జలపాతం వద్ద భక్తులు స్నానమాచరించారు.
స్వామిని ద ర్శించుకొని పుణీతులయ్యారు. స్వామి దర్శనం అనంతరం మోకాల పర్వతం వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలు, రాంపూర్ చెంచుపెంటకు చేరుకు ని భక్తులు విశ్రాంతి తీసుకున్నారు. దాతలు అం దించిన అల్పాహారం, అన్నదానం, అంబలి కేం ద్రాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రభుత్వం తాగునీటి వసతిని ఏర్పాటు చేసింది. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వివిధ రూట్ల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపారు.
నేడు భక్తులు రావొద్దు
సలేశ్వరం పరిసర ప్రాంతాల్లో శనివారం సా యంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు దాదాపు రెండు గంటలపాటు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి సలేశ్వరం క్షేత్రానికి వెళ్లేందుకు వేసిన మట్టిరోడ్డు బురదమయంగా మారి కొట్టుకుపోయింది. పుల్లాయపల్లి, రాంపూర్ పెంట వద్ద దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారు లు, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రోడ్లు దెబ్బతినడంతో ఆదివారం క్షేత్రానికి వెళ్లేందుకు కష్టంగా ఉంటుందని, భక్తులు ఎవరూ రావొద్దని అటవీ అధికారులు సూచించారు.
ఎంట్రీ ఫీజు తగ్గింపు
గతంలో ఎన్నడూ లేని విధంగా సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు సంబంధించిన వాహనాలకు ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తున్నారు. కారు, జీపు, లారీ, బస్సు, డీసీఎం ఇతర వాహనాలకు రూ.వెయ్యి, ట్రాక్టర్, ఆటోలకు రూ.500, బైక్లకు రూ.100 చొప్పున వసులు చేశారు. అయితే, విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చార్జీలు తగ్గించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శనివారం నుంచి చార్జీలను 50 శాతం తగ్గించారు. కారు, జీపు, లారీ, బస్సు, డీసీఎంలకు రూ.500, ట్రాక్టర్, ఆటోలకు రూ.100, బైక్లకు రూ.50 వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.