పాలమూరు, డిసెంబర్ 18 : సమైక్య రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ ఏర్పడ్డాక సకల సదుపాయాలు కల్పించామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇందులో భాగంగా పాలమూరు యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీయూలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి గెస్ట్హౌస్ వరకు రూ.90లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, రూ.70లక్షలతో చేపట్టిన యూనివర్సిటీ క్యాంటీన్ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పీయూలో త్వరలో ఇంజినీరింగ్, లా కోర్సులతో పాటు మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆరు నెలల్లోగా వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్లో భారీగా నిధులు తీసుకొచ్చి యూనివర్సిటీని నెంబర్వన్గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
బండమీదిపల్లిని బంగారుపల్లిగా మారుస్తామని స్పష్టం చేశారు. పీయూ సమీపంలోనే నూతన కోర్టు కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచే కోస్గి బైసాస్ రోడ్డు ఏర్పాటు కానున్నదన్నారు. అటు హన్వాడ ఫుడ్పార్కు, ఇటు ఐటీ పార్కుకు మధ్యన బండమీదిపల్లి ఉంటుందని, కేవలం పది నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. అమరరాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. పక్క రాష్ర్టాలన కర్ణాటక, మహారాష్ట్రతో తెలంగాణను పోల్చితే ఇక్కడ జరిగిన అభివృద్ధి తెలుస్తుందన్నారు. యువత ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు, కౌన్సిలర్ లక్ష్మీయాదగిరిగౌడ్, ప్రిన్సిపల్ కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అధ్యాపకులు పిండి పవన్కుమార్, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, రాజ్కుమార్, ఎంబీఏ విభాగాధిపతి అర్జున్కుమార్, వివిధ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.