పాలమూరు, డిసెంబర్ 18 : మహబూబ్నగర్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి జిల్లా దశాదిశను మారుస్తున్నామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం 387మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో ఇప్పటివరకు రూ.62.80 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులకు రూ.407 కోట్లు పంపిణీ చేశామన్నారు. అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను సీఎంఆర్ఎఫ్తో అన్నివిధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. గతం లో మహబూబ్నగర్లో 14రోజులకోసారి తాగునీరు వచ్చేదని, ట్యాంకర్ల వద్ద ప్రజలు నీటి కోసం రోజూ యుద్ధం చేసేవారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు తెలిపారు. 10వేల మందికి ఉద్యోగాలు కల్పించేవిధంగా దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీ పరిశ్రమను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించి పేదలకు మెరుగైన వేద్యసేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కారణంగా భూములు, భవనాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. సంక్షేమ పథకాల అమలుకు ఎవరైనా ఆ టంకాలు కల్పిస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. కాగా సంక్రాంతి పండుగ కానుకగా పేదలకు చీరలు, చికెన్ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, తాసిల్దార్ పార్థసారథి పాల్గొన్నారు.
అన్నివర్గాలకు సముచిత స్థానం
మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 18 : ప్రభుత్వం అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట క్రాస్రోడ్డు సమీపంలో రూ.10లక్షలతో ముదిరాజ్ సంఘం భవన ని ర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే నవాబ్పేట రోడ్డు తు వ్వగుట్ట వద్ద రూ.10లక్షలతో తొగట వీరక్షత్రియ సేవాసం ఘం కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
బ్రిడ్జి పనుల పరిశీలన
మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 18 : జిల్లా కేంద్రంలోని రహమానియా మసీదు సమీపంలో ప్రధానరహదారిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని తెలిపారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఉన్నారు.
ఆల్ఫైజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
మహబూబ్నగర్, డిసెంబర్ 18 : ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసై టీ రూపొందించిన 2023 సంవత్సర క్యాలెండర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా క్యాలెండర్ను రూపొందించిన సొసైటీ అధ్యక్షుడు జహంగీబాబాను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి మహ్మద్ యాకుబ్, బీఆర్ఎస్ మైనార్టీసెల్ మాజీ అధ్యక్షుడు మోసిన్ఖాన్, ముడా డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు సాయిలుయాదవ్, కౌన్సిలర్ చెన్నవీరయ్య, హన్మంతు పాల్గొన్నారు.